మహబూబ్నగర్, జూలై 15 : దళితబంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి, బోయపల్లి, మహబూబ్నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం దళితబంధు యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 315 యూనిట్లగానూ 241 యూనిట్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మరో 42 డెయిరీ యూనిట్లు రెండురోజుల్లో గ్రౌండింగ్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పనులకు దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాల నుంచి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి యాదయ్యగౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏర్పాట్లు చేయాలి
ఆగస్టు మొదటి వా రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ సహకారంతో నిర్వహించనున్న సమావేశానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూ చించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డిక్కి సంస్థ ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ సహకారంతో నిర్వహించనున్న సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి నూతన యూనిట్లు ఏర్పాటు చేసే అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో దళితబంధు కింద సెంట్రింగ్, డెయిరీ, ఇటుకల తయారీ, పౌల్ట్రీ, హార్డ్వేర్, పెయింటింగ్, జిరాక్స్, డీజీపీఎస్ వంటి ఎన్నో రకాల యూనిట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొత్త యూనిట్ల ఏర్పాటుకు డిక్కి సంస్థ సహకారం అందించాలని కోరారు. సమావేశంలో డిక్కి జిల్లా కోఆర్డినేటర్ శంకర్బాబు, జోనల్ కోఆర్డినేటర్ వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ అధికారి యాదయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్గౌడ్ తదితరులు ఉన్నారు.