వంటింటి నూనె ప్యాకెట్ నుంచి మొదలు నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు, వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగి సరకులు కొనాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలకుతోడు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపు మరింత ఆందోళన కల్గిస్తున్నది. వంట గ్యాస్ కంటే మళ్లీ కట్టెల పొయ్యే నయమనే పరిస్థితి కనిపిస్తున్నదని సోషల్ మీడియాలో జనం వాపోతున్నారు. గత నెలలో కాస్త అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు సైతం మే వచ్చే సరికి విపరీతంగా పెరగడంతో భారం పడుతున్నది.
– మహబూబ్నగర్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్ మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు కొండెక్కి కూర్చున్న ధరలతో ఎలా బతకాలో అర్థం కాక ఉసూరుమంటున్నారు. అసలే నిత్యావసర సరుకుల ధరలు, వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగి సరకులు కొనాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు పెరిగిపోయిన కూరగాయలు, నిత్యావసరాల ధరలతో మరింత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు కారణంగా సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పెట్రో ధరల పెంపుతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భారమై అన్ని వస్తువులపై ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా సామాన్యుడిపైనే తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతోంది. ఏం కొనాలన్నా ధరల భారం మోయలేని స్థితికి చేరుకుని సామాన్యుల బతుకులను మరింత భారంగా మారుస్తున్నాయి. కేంద్రం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను అడ్డూ అదుపూ లేకుండా పెంచుతూ పోతే భవిష్యత్తులో పేదలు దీనమైన స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదని జనం భగ్గుమంటున్నారు.
ఇవీ కూర‘గాయాలు’
బీన్స్ రూ. 160. ఈ ధర చూస్తేనే వామ్మో అనే పరిస్థితి నెలకొన్నది. హోల్ సేల్ వ్యాపారులే రూ.140 పెట్టి కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. కేవలం రూ.20 మార్జిన్ కోసం బీన్స్ కొనుగోలు చేసి నష్టపోవడం దేనికని వాటిని తీసుకురావడం లేదని పలువురు కూరగాయల వ్యాపారులు తెలిపారు. ఇక చిక్కుడు, క్యాప్సికం రూ.80 వరకు చేరుకున్నాయి. మిర్చి, బీర, కాకర, వంకాయ, దొండకాయ, క్యారెట్ రూ.60వరకు పలుకుతున్నాయి. కాలీఫ్లవర్, బెండకాయ, ఆలుగడ్డ రూ.40కి పైగానే అమ్ముడుపోతున్నాయి. ధరల భారం పెరగడంతో పేదలు కూరగాయలు తినడం లేదని పేదలు చాలామంది కూరగాయలు కొనేందుకు దుకాణానికి రావడం లేదని బాలు అనే కూరగాయల వ్యాపారి తెలిపారు. కాస్తలో కాస్త ఉపశమనం ఏదైనా ఉందా అంటే ఉల్లిగడ్డ రూ.20లోపు లభించడమే.
నిత్యావసర ధరలు పైపైకి..
గతంలో వంట నూనె ప్యాకెట్ ధర రూ.150నుంచి రూ. 170 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.200కు చేరుకున్నది. ఇక వివిధ తయారీ ఉత్పత్తులపైనా సుమారు 30శాతం ధరలు పెరిగాయి. సబ్బులు, షాంపూలపై ధరలు పెరిగిపోయాయి. కొన్ని స్టాండర్డ్ ధరలు ఉండే వస్తువుల క్వాంటిటీ తగ్గించి వినియోగదారునిపై కనబడకుండా భారం వేస్తున్నారు. రూ.10కి వచ్చే ఓ కంపెనీ టీ పొడి పాకెట్ గతంలో 50గ్రాములుంటే ఇప్పుడు అదే ధరలో కేవలం 40గ్రాములు మాత్రమే అందిస్తున్నారు. ఇక షాంపూ సాచెట్స్ విషయంలోనూ ఇదే సూత్రాన్ని వ్యాపారులు ఫాలో అవుతున్నారు. గతంలో రూ.2కు 8ఎంఎల్ ఉండే షాంపూ సాచెట్ వస్తే ఇప్పుడదే ధరలో కేవలం 5 ఎంఎల్ మాత్రమే ఇస్తున్నారు. ధరలు పెంచినట్లుగా కనిపించకపోయినా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తూ వ్యాపారులు సామాన్యుడిపై మాత్రం భారం వేస్తున్నారు. ధరల భారాన్ని తట్టుకోలేక సామాన్యులు లబోదిబోమంటున్నారు.
‘గ్యాస్’ మంట పుట్టిస్తున్నది
వంట గ్యాస్ కంటే కట్టెల పొయ్యే నయమనే పరిస్థితి కనిపిస్తోందని జనం వాపోతున్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నడ్డి విరిచిన కేంద్రం గ్యాస్ ధరలను రూ.వెయ్యి మార్కు దాటించి సామాన్యుల బతుకును ఆగం చేయడంతో చరిత్రలో నిలిచిపోయిందని జనం వాపోతున్నారు. అటు కూరగాయలు, ఇటు నిత్యావసర వస్తువులు, మరోవైపు పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి తమ బతుకులను కేంద్రం దుర్బరం చేస్తోందని ప్రజలు వాపోతున్నారు. వచ్చే అరకొర సంపాదనతో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ధరల నియంత్రణలో బీజేపీ సర్కార్ పూర్తిగా విఫలం కావడంతో ఏం కొనాలన్నా.. తినాలన్నా.. భారంగా మారింది. నిత్యావసర ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. సామాన్యుడి సంపాదనలో సింహభాగం వంటింటి సరుకుల ఖర్చులకే వెళ్తుండడంతో కుటుంబం గడవడం కష్టతరమవుతోంది. వంట గ్యాస్ ఇప్పటికే రూ.వెయ్యి దాటింది. వంట గది సరుకుల్లో అధిక ధర దీనిదే. ఇక మిగిలిన నిత్యావసర సరుకులు అందనంత ధరల్లో ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం మొత్తం వీటిపైనే పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పెంచిన ధరలు తగ్గించాలి
గతంలో ఎన్నడూ లేని విధంగా ని త్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. లీటర్ మంచినూనె రూ.90 ఉండేది. ఇప్పడు రూ.195 ఉంది. నిత్యావసర వస్తువులు కొనాలంటే విపరీతమైన ధరలు ఉంటే పేదవాడు ఎలా కొంటారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలి.
– మహ్మద్సాధిక్, మహబూబ్నగర్
గ్యాస్ ధరల పెంపుతో భారం
కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ధరలను పెంచడం వల్ల పేదలకు ఖర్చులు మరింత భారమవుతున్నాయి. రోజువారీ పనులు చేసుకొని జీవించే మాకు ధరల పెంపు కష్టతరంగా ఉంది. కూరగాయలు, నిత్యావసరాల ధరలన్నీ అమాంతం పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు గతంలో ఎప్పుడూ లేనట్లుగా రూ.వెయ్యి దాటింది. ఇవన్నీ మాపై భారం పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూపోతూ మాపై భారం పెంచుతున్నారు. భవిష్యత్తులో ఇలాగే ధరలు పెంచితే మా పరిస్థితి ఏంటో అర్థం కావడంలేదు.
– ఎం రవి, మహబూబ్నగర్