మహబూబ్నగర్టౌన్, మే 17: వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మంగళవారం పట్టణప్రగతి, హరితహారంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు పట్టణప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. వార్డులో సమావేశాలు, సమస్యలను పట్టణప్రగతిలో గుర్తించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ సారథ్యంలో మహబూబ్నగర్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ చేపట్టామన్నారు. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పట్టణప్రగతి నిర్వహిస్తున్నామన్నారు. హరితహారం కోసం మొక్కలు సిద్ధం చేయాలని, ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో ఖాళీస్థలాలు గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, ఎంఈ సుబ్రహ్మణ్యం, డీఈ బెంజిమెన్, సూర్యనారయణ, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.