వనపర్తి రూరల్, ఏప్రిల్ 5 : సాధారణంగా సీతారాముల కల్యాణాన్ని చైత్ర శుద్ధ నవమిన నిర్వహిస్తారు. కానీ, వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామంలో ఉన్న కోదండరాముల ఆలయంలో మాత్రం రెండ్రోజుల ముందు జరిపిస్తారు. చైత్రశుద్ధ పంచమిన కల్యాణ వేడుకలకు అంకురార్పణ చేసి.. సప్తమి రోజున కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.విగ్రహ ప్రతిష్ఠ ముహుర్తాన్ని అనుసరించి జీయర్ స్వామి ఆజ్ఞ ప్రకారం.. ప్రతి ఏటా సీతారాముల కల్యాణాన్ని నవమికి రెండ్రోజుల ముందు జరిపిస్తున్నారు. కల్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. కొవిడ్ నిబంధనల మేరకు వేడుకలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొండన్న తెలిపారు.
కోదండరాముల ఆలయాన్ని శాలివాహన శకం 1791లో నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తున్నది. నాటి వనపర్తి సంస్థానాధీశులైన రాణి శంకరమ్మ తన భర్త రాజారామేశ్వరరావు జ్ఞాపకార్థం ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో కోదండరాముల స్వామి విగ్రహాలను తమిళనాడు మఠాధిపతి మధురకవి రామానుజస్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. మూలవిరాట్ను భద్రాచలంలోని విగ్రహాలను పోలి ఉంటాయి.భద్రాదిలో సీతారాములకు లక్ష్మణుడు ఎడమ వైపున ఉండగా.., ఇక్కడ కుడి వైపున ఉండడం విశేషం. భద్రాద్రి రాముడిని వైకుంఠరాముడిగా, ఇక్కడి రాముడిని పట్టాభిరాముడిగా పిలుస్తారు.
దాదాపు 147 ఏండ్ల కిందట మా పూర్వీకులను రాణి శంకరమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఆనాటి నుంచి మా నలదూర్ వంశుస్తులు సీతారాముల స్వామి సేవలో గడిపారు. స్వామి సేవ చేయడం మహాభాగ్యం. ఇప్పటికీ ట్రస్టు ఆధీనంలోనే ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో నిత్యకైంకర్యాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలోని పంచలోహ ఉత్సవ విగ్రహాలు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా లేవు.
– కేఎన్ రామస్వామి, ఆలయ అర్చకుడు