దేవరకద్ర రూరల్, జూలై 16 : ఉమ్మడి రాష్ట్రంలోనే వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లాకు.. నేడు ఇతర రాష్ర్టాల కూలీలు వలసలు వస్తున్నారు. మనవద్ద సాగు పనుల్లో ఇతర రాష్ర్టాల కూలీలు పనులు చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ సర్కార్ చేపట్టిన సంస్కరణలతోనే సాధ్యమైందని చెప్పొచ్చు. దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల శివారులో ఉన్న ఊకచెట్టు వాగు, ముసాపేట, అడ్డాకుల మండలాల శివారులో ఉన్న పెద్ద వాగులో రూ.170 కోట్లతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృషితో.. సీఎం కేసీఆర్ పాలనలో మొత్తం 21 చెక్డ్యాంలు నిర్మించారు. దీంతో ఆయా చెక్డ్యాంలలో దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర నీటితో కళకళలాడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో పంటసాగు ఘణనీయంగా పెరిగింది. రైతులందరూ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న కూలీలు సరిపోక ఏపీ, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా రాష్ర్టాల నుంచి కూలీలు మహబూబ్నగర్కు వలసలు వస్తున్నారు. కాగా, చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి వరి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ కూలీలు దొరకకపోవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన 20 మంది కూలీలను వరి నాట్లు వేసేందుకు పిలిపించాడు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్లోకి తేవడం, చెక్డ్యాంల నిర్మాణాలతో పాలమూరు రూపురేఖలు మారిపోయాయి.