మహబూబ్నగర్, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్రానికి సమీపంలో కొలువైన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండవుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామికి హనుమ వాహన సేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే ప్రభోత్సవం జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి దర్శనంతో పరవశించిపోతున్నారు. గ్రామీణ ప్రాంత భక్తులు ఎడ్లబండ్లపై కొండపైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులతో కొండ ప్రాంతం కిటకిటలాడుతున్నది. విద్యుద్దీపాల అలంకరణలో శోభాయమానంగా ఆలయం దర్శనమిస్తున్నది. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలతో పాటు టాయిలెట్ల సౌకర్యం కల్పించారు.