దేవరకద్ర రూరల్, డిసెంబర్ 20: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం చిన్నచింతకుంట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆల హాజరయ్యారు. ముందుగా గూడూరు గ్రామానికి రూ.1.20కోట్లతో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించి విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించి అభినందించారు. అదేవిధంగా గ్రామంలో రూ.2.46లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి, బండర్పల్లిలో రూ.4.6లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి, తిర్మలాపూర్లో సీసీరోడ్డు నిర్మాణానికి మొత్తం రూ.9.52లక్షల ప్రొసీడింగ్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. అనంతరం మద్దూర్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. అలాగే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామంలో చిన్నచింతకుంట మండల రైతు ఉత్పత్తిదారుల ఎఫ్పీవో కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ఏండ్లుగా ఎదురుచూసిన గూడూరువాసుల బీటీరోడ్డు కల త్వరలోనే నెరవేరుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినందున ప్రతి పల్లె సందరంగా మారిందన్నారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు, సీసీరోడ్లు, హైమాస్ట్ లైట్లు, గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నీటి ట్యాంకర్, వైకుంఠధామాలు, రోడ్ల వెంట చెట్లు తదితర పనులతో గ్రామాలు కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధుతో రెండు పంటలకు ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడిసాయం, 24గంటల విద్యు త్, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం వంటి వాటితో రైతు ఇబ్బందులను తీర్చినట్లు తెలిపారు. రైతులు సేంద్రియ పంటలపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలన్నారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించొద్దన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.