మహబూబ్నగర్, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వ తీరుతో సీనియర్ సిటిజన్లకు వయోభారంతో పాటు ప్రయాణ భారం పడింది. జీవన ప్రయాణంలో సంతోషకరమైన రోజులు గడపాల్సిన వృద్ధులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి చేదు వార్త అందించారు. రైల్వే టికెట్పై రాయితీ ఇవ్వటం కుదరదని ప్రకటించింది. ఇకపై సామాన్యుల మాదిరిగానే టికెట్ ధరలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పండుటాకుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడాబాబులకు రూ.లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నది.. కానీ మా లాంటి నిస్సహాయుల సంక్షేమాన్ని మాత్రం మరిచిందని పలువురు ఆవేదన చెందుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 8,350 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,000 మంది ఉన్నారని సీనియర్ సిటిజన్ల ఫోరం నేతలు తెలిపారు. అయితే వీరంతా ఆందోళన చేయలేరు.. గట్టిగా గళం విప్పలేని స్థితిలో ఉన్నారు.
సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణంలో సబ్సిడీ ఇవ్వబోమంటూ కేంద్రం ప్రకటించింది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కార్ ఆలోచనను మానుకొని సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణంలో సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు. వృద్ధులు సాదారణంగా అవసరం ఉంటేనే ప్రయాణం కొనసాగిస్తారు. ఇది ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. రైలు ప్రయాణంలో మరిన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారు. వృద్ధులు రైలు ప్రయాణం తక్కువగానే సాగిస్తున్నా.. మోదీ సర్కార్ మాత్రం అసలు రైలు ఎందుకు ఎక్కుతారు అన్నట్లు వారికి సబ్సిడీని ఎత్తేసింది. ఇది ఎక్కడి విధానమంటూ ప్రశ్నిస్తున్నారు. వృద్ధులు వారి జీవిత ప్రయాణంలో సంతోషకరమైన రోజులను గడిపేందుకు కేంద్రం అండగా ఉండాల్సిపోయి వారికి ఉన్న రైలు ప్రయాణంలో సబ్సిడీని తొలగించడం ఏమిటని పలువురు వాపోతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 17,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న వారు మహబూబ్నగర్ జిల్లాలో 8,350 మంది ఉండగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,000 మంది ఉన్నారని సీనియర్ సిటిజన్ల ఫోరం నేతలు చెబుతుండ్రు. ఉద్యోగాలు చేయని వారు లక్ష మందికిపైగా వృద్ధులు జిల్లా వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నది. కేంద్రం పునరాలోచించి తుది ప్రకటన చేయాలని వృద్ధులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఆందోళన చేయలేరు..గట్టిగా అడగలేరు..
కుటుంబ బాధ్యతలతోపాటు వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుగులతో కుటుంబాలను నెట్టుకొచ్చి నేడు వయోభారంతో సాఫీగా జీవనం సాగిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం తెలియజేసిన నిర్ణయం మేరకు వృద్ధులు ఆందోళనలు, రాస్తారోకోలు చేయలేని పరిస్థితి ఉన్నది. వృద్ధులకు అవసరమైతే మ రింత తోడ్పాటును అందించాల్సిన కేంద్రం ప్రభుత్వం సబ్సిడీని ఎత్తేసి వారి ప్రయాణానికి అడ్డంకిగా మారింది. తక్కువ ప్రయాణాలు చేసే వృద్ధులు కేం ద్రం తీసుకున్న నిర్ణయం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేసే శక్తి లేకున్నా ఎవరికీ ఉండనంత అనుభవంతో వారికి ఉన్నది.
అండగా ప్రభుత్వం
వృద్ధులకు ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆసరా ఫించన్లతోపాటు అన్ని విధాలుగా వారికి మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్లు సాదక, బాధకాలను తెలియజేసుకునేందుకుకు ప్రత్యేకంగా వేంకటేశ్వర కాలనీలో స్థలం ఇచ్చి భవన నిర్మాణం చేపట్టింది. సీనియర్ సిటిజన్ల సమస్యలు ఉంటే క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెంటనే స్పందించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. సీనియర్ సిటిజన్ల అనుభావాలను, సూచనలు, సలహాలను తీసుకుంటు.. వారి అలోచనలకు పదును పెడుతూ మహబూబ్నగర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు.
ఆందోళనలు చేయాలా..?
చేసినంత కాలం కష్టం చేశాం. ఎప్పటి నుంచో వృద్ధులకు రైలు ప్రయాణం లో సబ్సిడీ ఉన్నది. అది కూడా లే కుంటే ఎలా..? అనుభవం ఉన్న మాలాంటి వారితో సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఆందోళనలు, ధర్నాలు చేయాలంటే ఎ లా..? కేంద్ర ప్రభుత్వం మరోసా రి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సబ్సిడీ లేదు.. మీ ఇష్టం.. రైలు ఎక్కితే ఎక్కండి.. లేకుంటే లేదు.. అన్నట్లు కేంద్రం ధోరణి ఉన్నది. ఇది సరికాదు.
– సాయిల్గౌడ్, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు, మహబూబ్నగర్
మాకు ప్రత్యేక గుర్తింపునివ్వాలి
అసలే చేతకాని వయస్సుకు వచ్చాం. ఈ సమయంలో మీకు అది లేదు.. ఇది లేదు.. అంటే ఎలా..? మమ్మల్ని ప్రశాంతంగా జీవించేందుకు మరింత తోడ్పాటును అందించాలి. సత్తువ ఉన్నంత కాలం శ్రమించి పనిచేశాం. వృద్ధాప్యమైనా కొంత ఊరట కల్పించాలి. మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి మాకు తోడ్పాటును అందించాలి. కానీ రైలు ప్ర యాణంలో ఉన్న సబ్సిడీని ఎత్తేయడం సరికాదు. మోదీ సర్కార్ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.