మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 18 : కులమతాలకన్నా సాటి మనిషికి సేవచేయడమే మిన్న అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజెపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, మన్యంకొండ ఆలయ కమిటీ బోర్డు సభ్యుడు ఎదిర ప్రమోద్కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రేగూరి కృష్ణతోపాటు 100 మంది, బీఆర్ఎస్ నాయకులు యాదయ్య, వెంకటేశ్, రమణారెడ్డి ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన భజరంగ్దళ్ ప్రముఖ్ బైకాని నర్సింహులుతో సహా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన 150 మంది చేరిన వారిలో ఉన్నారు. వీరికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు దుర్మార్గులు, కొన్ని పార్టీల నాయకులు కులమతాల పేరిట.. సెంటిమెంట్తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీతో సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. పలు పార్టీలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాల చేస్తూ యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి వద్ద అమరరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నదని తెలిపారు. దీంతో యువతకు వేలాదిగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. జిల్లాలో అభివృద్ధిని చూసి మరెన్నో పెద్ద కంపెనీలు వచ్చేస్తున్నాయని వెల్లడించారు. యువత సహకరిస్తే మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతానని మంత్రి పేర్కొన్నారు.