వనపర్తి, డిసెంబర్ 18: రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతన పాలకమండలి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ రమేశ్గౌడ్, వైస్ చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ అనుకూల పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రాకతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా మారిందని, ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో అదనంగా కోటి ఎకరాలు సాగులోకి వచ్చిందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. అందుబాటులో ఎరువులు, విత్తనాలు వందశాతం పంటల కొనుగోళ్లతో రైతులలో ఆత్మసైర్థ్యం పెరిగిందన్నారు. దండుగన్న వ్యవసాయ రంగానికి దన్నుగా నిలిచింది కేసీఆర్ మాత్రమేనని వివరించారు. 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగం బలోపేతమైతే అత్యధిక శాతం మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని వివరించారు.
కేంద్రంలోని ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై నిర్ధిష్టమైన విధానం లేదని, ఎరువుల సబ్సిడీలో కోత, పంటల కొనుగోలులో నిర్లక్ష్యం, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు అనూహ్యం గా పెరిగిపోయాయన్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా దేశంలో రైతు అనుకూల ప్రభుత్వం రావాలని కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాలను దేశంలోని ప్రతి రైతు దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగడుతామని చెప్పారు. దేశంలోనే వనపర్తి అతిపెద్ద వేరుశనగ మార్కెట్ అని, అంతర్జాతీయ మార్కెట్లో ఇక్కడి పల్లీకి మంచి డిమాండ్ ఉన్నదన్నారు. సాగునీటి రాకతో ఏటా లక్ష ఎకరాలలో వేరుశనగ సాగవుతున్నదని స్పష్టం చేశారు. వనపర్తి మార్కెట్ రాష్ర్టానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పాలకమండలి రైతుల పక్షాన నిలవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, శిక్షణ తరగతుల కమిటీ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు బాలకిష్టయ్య, శ్రీనివాసులు, లతీఫ్, శ్యాం సుందర్రెడ్డి, శివశంకర్, శంకరమ్మ, సత్యనారాయణ, సబ్బిరెడ్డి యుగంధర్రెడ్డి, యాదగిరి, పరంజ్యోతి, శ్రీనివాసులు, నంద తదితరులు పాల్గొన్నారు.