ఉండవెల్లి, నవంబర్ 27: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని , పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో రాములు ఆదివారం పరిశీలించారు. ప్రతి బీఎల్వో విధిగా ఓటరు నమోదులో పాల్గొని నూతన ఓటరు నమోదు, పేరులో మార్పులు, చేర్పులను నమోదు చేయాలని అదేశించారు. ఆర్డీవోవెంట తాసిల్దార్ వీరభద్రప్ప, బీఎల్వోలు ఉన్నారు.
పొరపాట్లు లేకుండా జాబితా రూపొందించాలి
పొరపాట్లకు తావు లేకుండా స్పెషల్ సమ్మరీ రివిజన్ -2023 ఓటరు జాబితా రూపొందించాలని తాసిల్దార్ లక్ష్మి బీఎల్వోలను ఆదేశించారు. ఆదివారం అయిజ మున్సిపాలిటీలోని బాలికల ఉన్నత పాఠశాల, పర్దిపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని తాసిల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించడంతోపాటు చనిపోయినా వారిపేర్లను తొలగించాలన్నారు. పేర్లు, ఊర్లు, నియోజకవర్గాలు, ఇతర మార్పులే, చేర్పులు చేసుకోవచ్చని ఓటర్లకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని వచ్చే నెల 3,4 తేదీలలో ఆయా పోలింగ్ కేంద్రాలలో చేపట్టనున్నట్లు తాసిల్దార్ తెలిపారు.
కొత్తగా ఓటుహక్కు పొందే వారు పోలింగ్ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తుకుని బీఎల్వోలకు దరఖాస్తు ఫారాలను అందజేస్తే ఓటుహక్కు పొందేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పటికే నూతన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. ఇందు లో వచ్చిన అభ్యంతరాలు, ఇతర సవరణలను పరిశీలించి జనవరి 5వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, రాజకీయ పార్టీల నాయకులు సమన్వయంతో తుది ఓటరు జాబితాకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయబ్ తాసిల్దార్ వెంకట్రావు, ఆర్ఐ దుర్గాసింగ్, బీఎల్వోలు పాల్గొన్నారు.
ఓటరు నమోదుకు యువకుల ఉత్సాహం
మానవపాడు, నవంబర్ 27: 18 సంవత్సరాలు నిండిన యువకులు తమ ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 121మంది యువకులు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.ఫాం 8లో కరెక్షన్కు 5 దరఖాస్తులు వచ్చినట్టు తాసిల్దార్ యాదగిరి తెలిపారు. ఆదివారం ఆర్డీవో రాములు గ్రామాల్లో పర్యటించి నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు.అర్హతగల ప్రతి యువకుడిని నమోదు చేసేకునేలా అవగాహన కల్పించాలని ఆర్డీవో రాములు సిబ్బందిని ఆదేశించారు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
అలంపూర్, నవంబర్ 27: 18 సంవత్సరాలు నిండిన ప్రతిపౌరుడు ఓటరుకుగా పేరు నమోదు చేసుకోవాలని ప్రత్యేక ఓటరరు నమోదు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొవాలని గద్వాల ఆర్డీవో రాములు అన్నారు. ఆదివారం పట్టణంలోని అలంపూరు, ఇమాంపురం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నమోదు ప్రక్రియను పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. విఐపీల ఓటరు జాబితాను ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించారు. తప్పులు లేకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరించాలన్నారు. తాసిల్దార్ సుభాష్నాయుడు మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేసిన 35 పోలింగ్ కేంద్రాల్లో ఫాం 6కు సంబంధించి 66 దరఖాస్తులు , ఫాం 7కు సంబంధించి 24 దరఖాస్తులు, ఫాం 8కి సంబంధించి 5 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోల సూపర్ వైజర్ శ్రీను, ఆరై శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.
ధరూరులో..
ధరూరు, నవంబర్ 27: 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని బాధ్యతగా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆర్ఐ లతీఫ్ అన్నారు. అదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఎల్వోలను ఆదేశించారు. కార్యక్రమంలో ఐకేసీ సీసీ నవీన్కుమార్, జయరాజ్, బీఎల్వో వీరమ్మ, రోజా తదితరులు పాల్గొన్నారు.