వనపర్తి, నవంబర్ 27:అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వివరాలు ఇక ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. సెంటర్లకు ఎందరో చిన్నారులు హాజరవుతున్నారు..గర్భిణులు, బాలింతలు, పౌష్టికాహారం, కిశోర బాలికలు, సెంటర్కు వచ్చే సరుకుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. న్యూట్రీషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం (ఎన్హెచ్టీఎస్) పేరుతో యాప్ను రూపొందించింది. కేంద్రాల నిర్వహణ వివరాలను గతంలో రిజిస్టర్లలో నమోదు చేసేవారు. ఆన్లైన్తో ఈ వ్యవస్థకు ఫుల్స్టాప్ పడనున్నది. ఎప్పటికప్పుడు వివరాలను మొబైల్లో
టీచర్లు నమోదు చేయాలి. సూపర్వైజర్లు, సీడీపీవోలు, డీడబ్ల్యూవోలు పర్యవేక్షణ చేయనున్నారు.
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, కిశోర బాలికల వివరాలను, వారికి అందించే పౌష్టికాహారంతో పాటు ఎత్తు, కొలతలు, కేంద్రానికి వచ్చే సరుకుల వివరాలు మొత్తం ఇక ఆన్లైన్ చేయనున్నారు. ఈ సమాచారం అంతా అంగన్వాడీ టీచర్లు 15రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉండేది. ఈక్రమంలో రిజిస్టర్ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లందరికీ స్మార్ట్ మొబైల్ ఫోన్లను అందజేసింది. ప్రస్తుతం 15 రిజిస్టర్లలో పొందుపర్చాల్సిన వివరాలకు సంబంధించి ఒక ప్రత్యేక యాప్ను రూపొందించారు. అంగన్వాడీ టీచర్లు అన్ని వివరాలను యాప్లో పొందుపర్చాల్సి ఉంది. దీంతో సూపర్వైజర్లు, సీడీపీవోలు, డీడబ్ల్యూవోలు వివరాలను పర్యవేక్షించడానికి సులభతరం అయింది.
న్యూట్రీషియన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతుంది? ఎక్కడైనా పంపిణీ చేయకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయా..? అనే అంశాల పరిశీలనను ఇకపై ఈ యాప్లో నమోదు చేసిన వివరాల ద్వారా తెలుసుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం న్యూట్రీషియన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం (ఎన్హెచ్టీఎస్) అనే ప్రత్యేక యాప్ను రూపొందించింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు రోజువారీగా పౌష్టికాహారం, పిల్లల ఎత్తు, బరువు వివరాలను నమోదు చేయాల్సి ఉండడంతో పారదర్శకత పెరిగింది.
చిన్నారులకు పౌష్టికాహారం
పౌష్టికాహార లోపంతో చిన్నారులు ఉండకూడదనే అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గర్భిణీ తీసుకునే పౌష్టికాహారం వల్లే పుట్టబోయే పిల్లల ఆరోగ్యం, బరువు ఆధారపడి ఉంటుంది. బిడ్డ పుట్టిన తరువాత బాలింతలకు పౌష్టికాహారం ఇస్తుండగా ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చిన్నారులకు ఆరేండ్లు వచ్చే వరకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. చిన్నారి ఎత్తు, బరువు, భుజం చుట్టూ కొలతలను నమోదు చేసి ఆ వివరాల ప్రకారం వయస్సుకు తగిన ఎత్తు, బరువు, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అనే వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో పొందుపర్చాలి. పూర్తి వివరాలతో మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు.
యాప్పై రెండు రోజుల శిక్షణ
ఎన్హెచ్టీఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్. అందులో ఉండే 15 రిజిస్టర్లకు సంబంధించిన వివరాలు, చిన్నారుల ఎత్తు కొలతలు, పౌష్టికాహారం అందజేత వంటితో పాటు అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టకాహార సమాచారం డీడబ్ల్యూవో పుష్పలత అంగన్వాడీ టీచర్లకు ఈనెల 15,16తేదీల్లో జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ ఐడీవోసీ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు.
పెరగనున్న పారదర్శకత
గతంలో అంగన్వాడీ టీచర్లు 15రకాల రిజిస్టర్లలో వివరాలను నమోదు చేసేవారు. రిజిస్టర్ల వ్యవస్థకు ప్రభుత్వం స్వస్తి పలుకుతూ ప్రత్యేక యాప్లో వివరాలను నమోదు చేయొచ్చు. యాప్ నుంచి అంగన్వాడీ వ్యవస్థ పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే మరింత పారదర్శకత పెరుగుతున్నది. ప్రతిరోజూ పౌష్టికాహార వివరాలను రాయాల్సిన పని లేకుండా అందించిన పౌష్టికాహార వివరాలను నమోదు చేసిన వెంటనే నిల్వ వివరాలను అంగన్వాడీ టీచర్లకు నేరుగా యాప్లోనే కనిపిస్తాయి.
– పుష్పలత, డీడబ్ల్యూవో, వనపర్తి