మక్తల్, ఆగస్టు 18: మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో గురువారం మండల స్థాయి పోటీల్లో విజేతలకు ఎంపీపీ వనజమ్మ మెమెంటోలను అందజేశారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల17న మండల స్థాయి ఖోఖో, వాలీబాల్, కబడ్డీ,అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. మక్తల్ మండలంలోని 20గ్రామాల నుంచి 300 మంది బాల,బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీ డాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో ఆధార్ కార్డులతో రిపోర్టు చేయాలని సూచించారు.
విజేతలు వీరే..
కబడ్డీలో బాలుర విభాగంలో ప్రథమ స్థానం ముస్లాయపల్లి, ద్వితీయ స్థానం భగవాన్పల్లికి దక్కింది. బాలికల విభాగంలో గుర్లపల్లి ప్రథమ, ముష్టిపల్లి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నది. ఖోఖో పురుషుల విభాగంలో ప్రథమ స్థానం ముష్టిపల్లి, ద్వితీయ స్థానం ఖానాపూర్, బాలికల విభాగంలో గుర్లపల్లి, ద్వితీయ స్థానంలో ముష్టిపల్లి నిలిచింది. కార్యక్రమంలో ఎంపీవో పావని, టగ్ ఆఫ్ వార్ జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్రాంత పీఈటీ గోపాలం, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, పస్పుల సర్పంచ్ దత్తప్ప, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, సుదర్శన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శివకుమార్, మధు, అరుణజ్యోతి, పీఈటీలు అమ్రేశ్, రమేశ్, దామోదర్ పాల్గొన్నారు.
నేడు ముగ్గుల పోటీ
మక్తల్ అర్బన్, ఆగస్టు18: వజ్రోత్సవాల్లో భాగంగా పురపాలిక ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నర్సింహ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఉదయం 10.30గంటలకు పట్టణంలోని సత్యసాయి మందిరంలో దేశభక్తికి సంబంధించిన ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.2016, రెండో బహుమతిగా రూ.1516, తృతీయ బహుమతిగా రూ.1016 ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.