ఉమ్మడి జిల్లాలో పాలమూరు సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. మహబూబ్నగర్తోపాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట ఐదు జిల్లాలు ఏర్పాటైనా తరగని ఆదరణ ఈ జిల్లా సొంతం. విభజన తర్వాత ప్రత్యేక గుర్తింపు పొందింది. 17 మండలాలతో ప్రస్తుతం జిల్లా కేంద్రం పరిపాలనకు కేంద్ర బిందువైంది. ప్రజలకు పారదర్శకమైన పాలన మరింత చేరువైంది. అభివృద్ధిలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ జిల్లాపై ప్రత్యేక అభిమానాన్ని చాటడం.. మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో ప్రగతి మెరిసింది.. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. జిల్లాకేంద్రం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ఐటీ టవర్ నిర్మాణం, అమరరాజా కంపెనీ ఏర్పాటు కానుండడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఎడ్యుకేషన్, టెంపు ల్, మెడికల్, టూరిజం హబ్గా రూపాంతరం చెందింది. రహదారులు విశాలంగా.. ఫోర్లైన్లు.. సెంట్రల్ లైటింగ్తో జిగేల్ మంటుంటే.. జంక్షన్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఆకర్షణీయమైన బొమ్మలతో సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.
మహబూబ్నగర్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాడు వలసలు, మంచినీళ్లకు గోసపడిన ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ వచ్చాక కొత్తకళను సంతరించుకున్నది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ 10 జిల్లాలుగా ఉన్న ఉమ్మడి జిల్లాలను విభజించి ఏకంగా 31 జిల్లాల ఏర్పాటుకు నాంది పలికారు. ఈ క్రమంలో సరిగ్గా ఏడేండ్ల కిందట అక్టోబర్ 11న ఉమ్మడి పాలమూరు జిల్లాను విభజించి ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలను ఏర్పాటు చేయగా.. ప్రజల కోరిక మేరకు తర్వాత గద్వాలను మార్చగా.. నారాయణపేటనూ నూతన జిల్లా చేయాలని ప్రజల కోరిక మేరకు 2018 ఎన్నికల్లో జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఆ తర్వాత అధికారంలో వచ్చాక నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసి ప్రజా అభిష్టాన్ని నేరవేర్చారు. చివరకు ఉమ్మడి పాలమూరులో 64 మండలాలతో వైశాల్యంలోనే పెద్దగా ఉన్న జిల్లా చివరకు ఐదు జిల్లాలుగా రూపాంతరం చెందింది. 14 నియోజకవర్గాలతో కూడిన ఉమ్మడి జిల్లాలో షాద్నగర్ నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపారు. కొడంగల్ నియెజకవర్గంలోని మూడు మండలాలను వికారాబాద్ జిల్లాలోకి చేర్చారు. తాజాగా 14 మండలాలు, నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లాగా మార్చారు. తర్వాత క్రమక్రమంగా ఐదు నియోజకవర్గాల పరిధిని విస్తరించి 17 మండలాలతో ప్రస్తుతం జిల్లా కేంద్రం పరిపాలనకు కేంద్ర బిందువైంది. గతంలో ఎక్కడో అచ్చంపేట, అలంపూర్ నుంచి జిల్లాకేంద్రానికి పనుల కోసం వచ్చేవాళ్లు.. అధికారులు అందుబాటులో లేకపోతే తిరిగి వెళ్లే వాళ్లు. చిన్న జిల్లాల ఏర్పాటు ప్రజల కష్టాలను దూరం చేసింది.
ఎక్కడికక్కడే జిల్లాలు ఏర్పడటంతో ప్రజలకు ఆయా జిల్లాకేంద్రాలు దగ్గరై పరిపాలన చేరువైంది. ఉమ్మడి జిల్లాను విభజించాక జిల్లా స్వరూపమే మారిపోయింది. చిన్న జిల్లాగా మారడంతో ఇక పాలమూరు పని అయిపోయినట్లే అని ప్రచారం చేసిన వాళ్లు నివ్వెరపోయేలా ప్రగతి పరుగులు తీస్తున్నంది. కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమపాళ్లలో నడుస్తుండటంతో అందనంత స్థాయికి ఎదిగింది. నాడు 14 రోజులకు మంచినీళ్లు వచ్చే పాలమూరులో మిషన్ భగీరథ పుణ్యమా అని రోజు తాగునీరు సరఫరా అవుతున్నది. రహదారులకు మహర్దశ వచ్చింది. ఏకంగా జాతీయ రహదారులు అనుసంధానం కావడం.. మెడికల్ కాలేజీ, ఐటీ హబ్, అమరరాజా బ్యాటరీ కంపెనీ రాకతో దశదిశనే మార్చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు గంట దూరంలో ఉన్న పాలమూరులో వ్యాపార, వాణిజ్య, మెడికల్, టూరిజం, టెంపుల్ హబ్గా మారి రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. తలసరి ఆదాయంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పోటీపడుతున్నది. రీజినల్ రింగ్రోడ్ రాకతో పాలమూరు మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వస్తుండటంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు కేంద్రం ఊడాన్ పథకం కింద ఎయిర్పోర్టుకు గ్రీన్సిగ్నల్ ఇస్తే దేవరకద్రలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్ జిల్లాతోనే పోటీపడ్తుందనడంలో సందేహమేలేదు. కొత్త జిల్లాలు ఏర్పడి ఏడేండ్లయిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
పాలమూరులో చేరువైన పాలన
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా వెలుగు వెలిగిన పాలమూరు జిల్లా కేంద్రం కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రగతిలో మరింత దూసుకుపోతున్నది. కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఇక పాలమూరు వెనుకబడుతుందని ప్రచారం చేసిన వాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు. చిన్న జిల్లాగా మారినాకే ఇటు పరిపాలనలో.. అటు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గతంలో జిల్లాకేంద్రంలో మంచినీళ్లు దొరకని పరిస్థితి. నాడు తాగునీటికి గడ్డుకాలం ఉండగా.. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ రాకతో కష్టాలకు చెక్ పడింది. ప్రతిరోజు నీళ్లు వచ్చే పరిస్థితి నేటిది. ఫలితంగా పాలమూరు రోజురోజుకూ విస్తరిస్తున్నది. గతేడాది డిసెంబర్ 4న కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కావడంతో ప్రజలకు అన్ని కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఏ చిన్న పని కావాలన్నా అలా వచ్చి.. ఇలా చేసుకుపోతున్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో రూ.300 కోట్లతో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన, రూ.50 కోట్లతో మల్టీఫ్లెక్స్ నిర్మాణం జరుగుతున్నది.
ఐటీ హబ్తో పెరిగిన ఉద్యోగావకాశాలు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం విభజించాక రాష్ట్ర ప్రభుత్వం టూటైర్ పట్టణాల్లో ఐటీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి భూములు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. దీంతో మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ తీసుకుని సుమారు నాలుగు వందల ఎకరాల్లో ఐటీ హబ్ను ప్రతిపాదించారు. దీంతో దివిటిపల్లి గ్రామ సమీపంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం పూర్తయింది. ఈ టవర్ ఆవరణలోనే దేశంలోనే తొలి లిథియం గిగా ఫ్యాక్టరీకి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు. ఐటీ హబ్ నిర్మాణం పూర్తి చేసుకోవడంతో సుమారు 12 కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావడంతో తల్లిదండ్రులు ఎంతో సంబురపడుతున్నారు.
జిల్లాలో అభివృద్ధి పరుగులు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభివృద్ధి పోటీపడి మరి చేస్తున్నారు. దీంతో ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు పోటిపడి తీసుకొస్తున్నారు. తాగు, సాగునీరు, పారిశ్రామిక, మెడికల్, టెంపుల్, టూరిజం వాటిలో దూసుకుపోతున్నది. జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర నియోజకవర్గాలు పోటీపడుతుండటంతో అవార్డుల పంట పండుతున్నది. జాతీయ ఉత్తమ మున్సిపాలిటీగా భూత్పూరు ఎంపికైంది. సీడ్బాల్స్ తయారీ, విత్తనాలు వెదజల్లడంతో గిన్నీస్ రికార్డు కొట్టేసింది. మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో జంక్షన్ల అభివృద్ధి, బైపాస్ నిర్మాణం సరికొత్త ఆకర్షణగా మారింది. తెలంగాణలోనే తొలి రోప్వే మన్యంకొండలో ఏర్పాటు కాబోతున్న ది. అక్కడే యాత్రికులకు వసతి కల్పించే దిశగా కల్యాణ మండపాలు, హరిత హోటల్ నిర్మాణంతో టెంపుల్సిటీ గా మారబోతున్నది. జి ల్లాల ఏర్పాటుతో పాలమూరు అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారింది.