ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చేందుకు శిక్షణ
మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్లో మంత్రుల నివాస సముదాయంలో సమీక్ష
మహబూబ్నగర్ జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు డీసీసీబీని పటిష్టం చేస్తామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ పటిష్టం కోసం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మహబూబ్ నగర్ డీసీసీబీ మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు ఉద్యోగుల పనితీరును పెంచేందుకు వివిధ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రుణాల వసూలుకు డీసీసీబీ డైరెక్టర్లు, సీఈవోలు ప్రధాన పాత్ర వహించాలన్నారు. డీసీసీబీ డైరెక్టర్లంతా శ్రద్ధ తీసుకుని బ్యాంకు రుణాల రికవరీకి సహకరిస్తే మరింత సాయం అందించేందుకు టెస్కాబ్ సిద్ధంగా ఉందన్నారు. సబ్సిడీ రుణాలు, పథకాలు ఆయా బ్రాంచులు, సొసైటీల పరిధిలోని రైతాంగానికి తెలిసేలా చర్యలు తీసుకుని వారికి మేలు చేకూర్చాలన్నారు.
డీసీసీబీ చైర్మన్లు, డైరెక్టర్లు, సహకార సంఘాల చైర్మన్లు క్రియాశీలకంగా పనిచేస్తేనే సహకార సంఘాలు పటిష్టమవుతాయిని మంత్రి స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆడిట్లు సమయానుసారంగా నిర్వహించాలని తెలిపారు. ఉమ్మడి పాలమూరులోని 77 సహకార సంఘాలను పటిష్టం చేయాలన్నారు. డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, సహకార సంఘాల చైర్మన్లు కలిసికట్టుగా పనిచేసి ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగాలన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అండగా ఉండాలన్నారు. సంఘా లు పటిష్టమైతే గ్రామాల్లోనే రైతులకు సులువుగా రుణాలు లభిస్తాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ఎండీ మురళీధర్, అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, సీఈవో ప్రకాశ్, వైస్ చైర్మన్ వెంకటయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు.