జడ్చర్లటౌన్, నవంబర్ 15: మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సమాజంలో బాధితులకు అండగా ఉంటూ, వారు స్వేచ్ఛగా జీవించేందుకు తీసుకొచ్చిన చట్టాల అమలులో పోలీసు అధికారుల పాత్ర ప్రధానమైనదన్నారు. జడ్చర్లలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో రాష్ట్ర పోలీసు ఉమెన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులకు మంగళవారం చట్టాల అమలుపై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడారు.
మహిళల భద్రతకు ప్రభుత్వం రూపొందించిన వివిధ చట్టాలపై అధికారులు అవగాహన పెంచుకోవాలన్నారు. రిసెష్పన్ నుంచి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాధితుల్లో న్యాయం జరుగుతుందని ఆత్మవిశ్వాసం కలుగుతుందన్నారు. మహిళలపై జరిగే హింసను అరికట్టే క్రమంలో వారి సామాజిక పరిస్థితులను గమనిస్తూ, సున్నితంగా వ్యవహరించాలన్నారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో వేగవంతంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. షీటీంలపై మరింత ప్రచారం చేస్తే మరింత మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు అడిషనల్ ఎస్పీ రాములు మాట్లాడారు. జిల్లా పోలీసుల పనితీరు అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ ఎస్పీ శ్రీరాంకుమార్ మాట్లాడారు. చట్టాల అమలులో సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో పాటు నిందితులకు తగిన శిక్ష పడేందుకు చేపట్టే దర్యాప్తు అంశాలపై వివరించారు. రెండు రోజుల పాటు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అధికారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మధు, రిసోర్స్పర్సన్స్ రవి, సతీశ్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.