ఖాళీ జాగా కనిపిస్తే చాలు ‘రియల్’ గద్దలు వాలుతున్నాయి. ఉండవల్లి మండలంలోని పుల్లూరులో భూములు మాయమవుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా రూ.కోట్లల్లో భూ దందా జోరుగా సాగుతున్నది. అనధికారికంగా వెంచర్లు వెలుస్తున్నాయి. హైవే-44 సమీపంలోనే ఉండడంతో నిత్యం దళారులు ఇక్కడ చక్కర్లు కొడుతున్నారు. అమాయకులను మాయ మాటలతో బుట్టలో వేసుకొని భూములు, ప్లాట్లు అధిక ధరలకు అంటగడుతున్నారు. ముందే రిజిస్ట్రేషన్ అయిన వాటిని పదే పదే విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు మాకేందుకు అన్న ధోరణిలో ఉంటున్నారు. మిగులు భూములను సైతం వదలడం లేదన్న ఆరోపణలుఉన్నాయి. వారికి రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అనధి కారికంగా సమాచారం అందుతున్నట్లు తెలిసింది. వీరి ఆగడాలతో బాధితులు లబోదిబోమంటున్నారు.
అలంపూర్, డిసెంబర్ 16: జోగళాంబ గద్వాల జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో ‘రియల్ భూం’ కొనసాగుతున్నది. రూ.కోట్లల్లో భూదందా చేస్తున్నారు. భూములు, ప్లాట్లు క్రయవిక్రయాల కోసం వందలాదిగా దళారులు నిత్యం జాతీయ రహదారి పుల్లూరుచౌరస్తా వద్ద చక్కర్లు కొడుతుంటారు. అమాయకులను బుట్టలో వేసుకొని భూములు, ప్లాట్లు అంటగడుతుంటారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన భూములు, ప్లాట్లను అధికారుల అండదండలతో పదేపదే విక్రయించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. డబుల్ రిజిస్టేషన్, ప్రభుత్వ భూమి అని తెలిసినా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లకు ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే తంతు జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. పుల్లూరు శివారులో సుమారుగా 7వేల ఎకరాలకు గానూ 2వేల ఎకరాల్లో 100వెంచర్లు వెలిశాయి. వాటిలో చేతివేళ్లపై లెక్కపెట్టే విధంగా డీటీసీపీ అప్రూవల్ అయిన వెంచర్లు, మిగతావి అనుమతుల్లేనివే.
పట్టాదారులు స్వాధీనంలో లేని భూములపై, ప్లాట్లపై దళారులు ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పూర్వోపరాలు వెలికితీసి దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్, తాసిల్దార్ కార్యాలయాల్లో కొంతమంది స్వార్థపరులు ఉద్యోగుల సహాయంతో వాటి డాటా సేకరించి అనధికారికంగా సమాచారం చేజిక్కించుకుంటున్నారు. అసలు పట్టాదారులు స్థానికంగా లేనప్పుడు వారి స్థానంలో అదే పేరుగల వ్యక్తితో ప్లాటుకు ఏమాత్రం సంబంధం లేని ఇతర వ్యక్తుల ద్వారా తతంగం కొనసాగిస్తారు. అడ్రస్, వయసు, ఫొటో, మార్పు చేసి అసలు పట్టాదారుడిగా మార్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న అసలు పట్టాదారులు ఇతరుల పేర్లమీదకు ఎలా మారాయని అవాక్కవుతున్నారు. వారి భూములను, పొలాలను తిరిగి దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి కేసులు అలంపూర్తోపాటు మిగతా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చాలా ఉన్నాయి. ఈ తతంగం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్లాట్ల బ్రోకర్లుగా, మధ్య దళారులుగా అవతారమెత్తి వారి కనుసన్నల్లో నడిపిస్తున్నారు.
కార్యాలయాల్లో రెగ్యులర్ అధికారి లేనప్పుడు దళారులు అదునుచూసి ఇన్చార్జి అధికారితో కుమ్మక్కై అడ్డగోలు పనులకు పాల్పడుతున్నారు. సాధారణంగా రెగ్యులర్ అధికారి ఉన్నప్పుడు జరుగని రిజిస్ట్రేషన్లు ఇన్చార్జి అధికారులు ఉన్నప్పుడు రెట్టింపుస్థాయిలో జరుగున్నాయంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే. అక్రమాలు చేసే దళారులు ఒక్కోసారి డాక్యుమెంట్లు స్థానిక రైటర్ల ద్వారా కాకుండా ఇతర ప్రాంతాల్లో తయారు చేయించుకొని వచ్చి నేరుగా రిజిస్ట్రేషన్కు వెళ్తున్న ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్లు సరిగా లేనివి, బినామీ రిజిస్ట్రేషన్లు, లింకు డాక్యుమెంట్లు లేనివి, ఒరిజనల్ డాక్యుమెంట్లు లేనివి, అవకతవకలు ఉన్నవి, సరైన ఆధారాలు లేనివి ఎక్కువగా ఇన్చార్జి అధికారులు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రేట్ ఫిక్స్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కార్యాలయాల్లో అధికారులు ఏండ్లుగా విధులు నిర్వహించడం వల్ల అవినీతిపనులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ కాగా, అందులో కొంత మిగిలిన భూములను ఖరీదు చేసిన వారు, లేదంటే వారి పక్కనున్న వారు పట్టాదారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కబ్జా చేస్తున్నారు. ఉండవల్లి మండల పరిధిలో గతంలో 44వ జాతీయ రహదారి నాలుగు రోడ్ల విస్తరణ పనుల సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్లాట్లు కొంత కటింగ్ పోనూ మిగిలిన ప్లాట్లు, భూములు చుట్టుపక్కల ఉన్నవారు కబ్జా చేశారు. స్థానికంగా ఉండని అసలు పట్టాదారులను ఆసరా చేసుకొని వారికి భూములు, ప్లాట్లు ఏమీ లేవని, రోడ్డు కటింగ్లో పోయాయని భయాందోళనకు గురిచేస్తున్నారు. నేటికీ నిత్యం బాధితులు అలంపూర్ చౌరస్తాకు వచ్చి ప్లాట్లు వెతుక్కునే పనిలో ఉన్నారు. ప్లాట్లు సర్వే చేయాలని రెవెన్యూ అధికారులు గాని, హైవే అథారిటీకి గాని తెలిపినా ఆయా శాఖల అధికారులు స్పందించక పోవడం గమనార్హం.
జిల్లాలో ఎక్కడా లేనన్ని వెంచర్లు పుల్లూరు శివారులో వెలిశాయి. వాటిలో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ధరణి తర్వాత చాలా భూసమస్యలు పరిష్కరించాం. అప్రూవల్ లేని ప్లాట్ల సమస్యలు ఉన్నాయి. పట్టాదారులు స్వాధీనంలో లేని ప్లాట్లు, భూములు పంచాయతీలు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. మా పరిధిలో ఉన్నంతవరకు పరిష్కరిస్తున్నాం.
– వీరభద్రప్ప, తాసిల్దార్, ఉండవల్లి