తిమ్మాజిపేట, జనవరి 12 : కోరిన కోర్కెలు తీర్చే నర్సన్న(లక్ష్మీనర్సింహస్వామి) ఉత్సవాలు సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 13 నుంచి అప్పాజిపల్లిలో ప్రారంభం కానున్నాయి. ఐదు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన స్వామి వారి బ్రహ్మో త్సవాలు మూడు రోజులుపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి అనుగ్రహం లేనిదే తమకు ఏదీ కలిసిరాదన్నది ఇక్కడి ప్రజల విశ్యాసం. ఏ కార్యం తలపెట్టిన ముందుగా స్వామిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అందులో భాగంగానే ప్రతి యేటా సంక్రాంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ.
తిమ్మాజిపేట మండలంలోని అప్పాజిపల్లి నర్సన్నగుట్టపై లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూగా అవతిరించినట్లు చరిత్ర చెబుతున్నది. హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం స్వామి గుట్టపై సేదదీరాడన్నది ప్రచారంలో ఉన్న చరిత్ర. సుమారు వంద సంవత్సరాల కిందట గుట్టపై నర్సింహస్వామి ఉన్నట్లు ఈ ప్రాంతవాసులు గుర్తించారు. భారీ రాతి గుహలో ఉన్న స్వామిని మొదట దర్శించడానికి పాకుతూ వెళ్లాల్సి వచ్చేది. క్రమంగా ప్రజలు రాతిని తొలిచి, గర్భగుడిలోకి భక్తులు వెళ్ల్లి పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
నర్సన్నగుట్టపై లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని దాతలు, ప్రభుత్వ సహకారంతో గ్రామస్తులు అభివృద్ధి చేశారు. గతంలో కొండపైకి నడిచి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం భారీ వాహనాలతో సహా అన్ని వాహనాలు కొండపైకి వెళ్లేందుకు రోడ్డును ఏర్పా టు చేశారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలను నాటి ఆహ్లాదకరంగా మా ర్చా రు. గుట్టపై వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ సదుపాయంతోపాటు విద్యుత్, భక్తులకు తాగునీరుతదితర సౌకర్యాలు కల్పించారు. తెలంగాణ దేవాదాయశాఖ నుంచి సుమారు రూ. 68లక్షలు మంజూరు కావడంతో ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేపట్టారు. గుట్టపై ప్రధాన ఆలయంతోపాటు, ఆంజనేయస్వామి, మహాలక్ష్మీ, ఆండాల్ అమ్మవార్ల ఆలయాలు కూడా నిర్మించారు. భక్తుల కోసం దాతల సహకారంతో వంటశాల, అతిథి గృహాలతోపాటు ఇటీవల గుట్టపైకి రెండో దారిని కూడా ఏర్పాటు చేశారు. కరోనా అనంతరం ఇక్కడ వివాహాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు పెద్దసంఖ్యలో నిర్వహిస్తున్నారు. స్వామివారిపై భక్తులు అచంచలమైన విశ్వాసంతో ఇక్కడ ప్రతి శనివారం, పర్వదినాలలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈనెల 13న (శనివారం) అంకురార్పణ, సుదర్శన హోమం, సా యంత్రం పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 14న (ఆదివారం) స్వామి వారి కల్యాణం, సత్యనారాయణ వ్రతాలు, అన్నదానం, రాత్రికి తేరు, 15న సామూహిక సత్యనారాయణ వ్రతాలు, జాతర, చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చే బండ్లు గుట్ట చుట్టూ తిప్పుతారు. అనంతరం ఉద్దాల కార్యక్రమంతోపాటు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానుండడంతో ఆలయ అధికారులు, నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.