బీఆర్ఎస్ పార్టీ దృష్టంతా అభివృద్ధి, సంక్షేమం వైపే ఉంటుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు పట్టణంలో ఆదివారం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విజ్ఞతతో ఆలోచించి ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్న వారికి ఓటెయ్యాలని కోరారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. 1956 నుంచి తెలంగాణను చెరబట్టిన ఢిల్లీ దొరల పార్టీ.. కాంగ్రెస్ కాదా అని మండిపడ్డారు. పక్క రాష్ర్టాల నుంచి నాయకులను అరువు తెచ్చుకొని ప్రచారం చేస్తున్నారన్నారు. హస్తం గుర్తుకు ఓటేస్తే భవిష్యత్ అంతా అంధకారమే అవుతుందన్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయని, అందులో ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుని పాలన సాగించిన కేసీఆర్ సర్కారు వస్తుందో.. ఢిల్లీ దొరల ప్రభుత్వం వస్తుందో చూద్దామని రాహుల్కు సవాల్ విసిరారు.
కల్వకుర్తి/ ఆమనగల్లు, నవంబర్ 5 : తెలంగాణ బిడ్డలను హరిగోస పెట్టిన ఢిల్లీ దొరల పాలన కావాలా? అభివృద్ధి, సంక్షేమ పాలన అందించే కేసీఆర్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ మళ్లీ అంధకారంలోకి వెళ్తుందని, విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దొరల తెలంగాణ అంటూ రాహూల్గాంధీ మాట్లాడిన తీరుపై మంత్రి విరుచుకుపడ్డారు.
అసలు ఢిల్లీ దొరలు మీరు.. తెలంగాణకు మీ ముత్తాతల కాలం నుంచి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. 1956లో తెలంగాణను ఆంధ్రా ప్రాంతంలో విలీనం చేసి తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంపదను కొల్లగొట్టారని విమర్శించారు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం సాగుతుంటే 369 మంది విద్యార్థులను బలితీసుకున్నది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలికొన్నది ఎవరని నిలదీశారు. 1956 నుంచి తెలంగాణను చెరబట్టిన ఢిల్లీ దొరల కాంగ్రెస్ పార్టీ మీది కాదా అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ ఉద్యమం సాగించారని, ఉద్యమ ఫలితంగానే ఢిల్లీ దొరలు తలవంచి రాష్ట్రం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదిన్నర సంవత్సరాలు కావస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, పింఛన్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. సాగునీటి రంగంలో వినూత్న విప్లవాన్ని తీసుకొచ్చామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని వివరించారు.
సభలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పక్క రాష్ర్టాల నుంచి నాయకులను అరువు తెచ్చుకొని ప్రచారం నిర్వహిస్తున్న మీరు నాయకులేనా అంటూ మండిపడ్డారు. డబ్బు సంచులతో ప్రజలను వంచనకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.కర్ణాటక రాష్ట్రం నుంచి అరువు తెచ్చుకున్న మీ పార్టీ నాయకుడు,కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాట్లాడిన మాటలతో తెలంగాణ బిడ్డలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో 5గంటల కరెంటు ఇస్తన్నామని, తెలంగాణలో కూడా 5గంటల కరెంటు ఇస్తామని చెప్పడం సిగ్గుటేని, కాంగ్రెస్ నాయకుల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరైన చనిపోతే దహన సంస్కారాల అనంతరం స్నానం చేయడానికి పావుగంట కరెంటు ఇవ్వాలని విద్యుత్ అధికారులకు ఫోన్ చేసిన సందర్భాలు లేవా అని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వం రావాలని మళ్లీ కోరుకుంటే చీకట్లో మగ్గడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంటు ఉండదు, ఎరువుల విత్తనాల కోసం లైన్లు, పెట్టబడి సాయానికి చరమగీతం, పింఛన్ల కథ కంచికేనని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లు డబ్బులిస్తే తీసుకోవాలని, ఓట్లు మాత్రం అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించే కారుగుర్తుకు వేయాలని పిలుపునిచ్చారు.
బక్కపలచని కేటీఆర్ను ఢీకొట్టేందుకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతలు తండొపతండాలుగా వస్తున్నారని, ప్రజా బలం ఉన్న నేతను ఏమీ చేయలేరన్నారు. సింహం సింగిల్గానే వస్తుందని కేటీఆర్ అనగానే.. సభికులు పందులే గుంపులు గుంపులుగా వస్తామని నినాదాలు చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అస్త్ర సన్యాసం చేశాడని, తట్టా బుట్టా సర్దుకుంటుంటే.. ఢిల్లీ నుంచి ప్రధాని, హోంమంత్రి, కేంద్ర మంత్రులు ప్రచారానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అయ్యిందని మంత్రి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూర్చిందన్నారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసి వారి తండాలో వారికే పాలన అప్పగించామన్నారు. గిరిజన రిజరేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని గుర్తుచేశారు. తెలంగాణలో అమలయ్యే ఏ ఒక్క పథకమైనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓట్లు వేయాలని, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందని హెచ్చరించారు. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్యాలయంతోపాటు, గట్టుప్పలపల్లి, వెల్జాల్, రఘుపతిపేట మండలాలను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అంతకుముందు కేటీఆర్కు బీఆర్ఎస్ నేతలు గద, గొంగడి, గొర్రెపిల్లను బహూకరించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ డబ్బు మూటలతో వచ్చిన కాంగ్రెస్ నాయకులను నమ్మవద్దని సూచించారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్పార్టీకి చెందిన అభ్యర్థి సంతలో పశువులను కొన్నట్లు బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు అనురాధ, దశరథ్నాయక్, విజితారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, ఎంపీపీలు నిర్మల, మనోరమ, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, వైస్ ఎంపీపీలు అనంతరెడ్డి ఆనంద్, మండలాలు, పట్టణాల అధ్యక్షులు అర్జున్రావు, పత్యానాయక్, పరమేశ్ పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సభకు వచ్చిన చిన్నారి ఎంగలి తెలంగాణ స్ఫూర్తి తాను కిడ్డీబ్యాంక్లో దాచుకున్న 12 వేల రూపాయలను మంత్రికి అందజేసింది. నామినేషన్ ఖర్చులకు ఈ డబ్బును వినియోగించాలని కోరడంతో చిన్నారి అభిమానానికి మంత్రి కేటీఆర్ ఉప్పొంగిపోయారు. చిన్నారి తండ్రి ఎండలి రఘు బహూకరించిన గధతో చిన్నారితో కలిసి మంత్రి హావభావాలు వ్యక్తం చేశారు.