తల తెగిపడ్డా బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ జత కట్టేది లేదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. కొత్తకోట, నారాయణపేట, మక్తల్ పట్టణాల్లో ముస్లింలతో వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కార్యక్రమాలకు దేవరకద్ర, నారాయణ పేట, మక్తల్ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ను నమ్మితే గోసపడతాం.. బీఆర్ఎస్ను నమ్మితే బాగుపడతామన్నారు.
మదనాపురం, నవంబర్ 8 : మతసామరస్యానికి నిలయంగా తెలంగాణ నిలిచిందని, అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కొత్తకోట పట్టణంలోని ఓ గార్డెన్లో బుధవారం నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎంతో వేధన పడ్డామన్నారు. ముస్లింల పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమై మెకానిక్ షాపుల్లో, హోటళ్లలో పనిచేస్తూ జీవనం కొనసాగించేవారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 11 మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మైనార్టీలకు పెద్దపీట వేశారని తెలిపారు. దీంతో 240పైగా గురుకుల పాఠశాలలను నెలకొల్పి మన పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేశారన్నారు. తెలంగాణలో 17వేల మసీదులు ఉన్నాయని, ఒక్కో మసీదుకు ఇమాం, మౌజామ్లకు రూ.5వేల చొప్పున నెలకు రూ.10వేలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
వారి జీవనభృతికి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. తలతెగిపడినా బీజేపీతో జతకట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పడం తప్పా చేతల్లో శూన్యమన్నారు. కర్ణాటకలో గెలించేందుకు అక్కడి ముస్లింలకు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక వారిని నిండా ముంచిందని తెలిపారు. ఒక్క ముస్లీంలనే కాకుండా అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆసరా ఫించన్లు రూ.200 వందలు ఉండగా, సీఎం కేసీఆర్ 10రెట్లు పెంచి రూ.2016 ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో రూ.5వేల వరకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గానికి ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, మరోసారి ఆదరిస్తే సేవకుడిగా మరింత సేవ చేస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని విశ్వేశ్వర్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కాటం ప్రదీప్కుమార్గౌడ్, ఇబ్రహీం, ఎంఐఎం నాయకులు జుబేర్ బిన్ సయ్యద్, అబ్దుల్ ఖదీర్, మునీర్, మహెమూద్, అలీం, ఖాజా, వసీం, ఘని తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్, (మక్తల్) నవంబర్ 8 : ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సుస్థిర పాలన బీఆర్ఎస్కే సాధ్యమని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం మక్తల్ పట్టణంలోని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో హైదరాబాద్లో ఎలాంటి మత ఘర్షణలు, కర్ఫ్యూలు లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ముస్లింలకు అన్ని హక్కులు, సౌకర్యాలు లభిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ను తెలంగాణ పితగా కొనియాడారు. ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ రూ.2,200 కోట్లు ఖర్చు పెట్టినట్లు గుర్తుచేశారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాలు, కుల మతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన దొంగ రేవంత్రెడ్డి తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని సీఎం కేసీఆర్ను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అలాగే నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి ప్రచారంలో హోంమంత్రి పాల్గొన్నారు.
కొత్తకోట, నవంబర్ 8 : కొత్తకోటకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గఫార్, ఖాజామైనొద్దీ, జహీర్, మోసిన్, రియాజుద్దీన్, అమీర్తోపాటు 100మంది ఉన్నారు.
హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి వాహనాలను బుధవారం కనిమెట్ట చెక్పోస్టు వద్ద ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కొత్తకోట మైనార్టీ ఆత్మీయ సమ్మేళానికి వస్తుండగా, వాహనాలను ఆపి తనిఖీ చేసినట్లు పెద్దమందడి ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.