నారాయణపేట : మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ వద్ద కొడంగల్ ఎత్తిపోతల ( Kodangal Lift Irrigation ) పనులపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎత్తిపోతల పథకం కమిషన్ల కోసమే తప్ప రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని పేర్కొన్నారు.
భూత్పూర్ రిజర్వాయర్ వద్ద కొత్తగా నిర్మించే రెగ్యులేటర్ కరెక్టు కాదని, గతంలో ఉన్న రెగ్యులేటర్ను, పక్కనే ఉన్న మరో రెగ్యులేటర్ను నిర్మిస్తే చాలని వెల్లడించారు. అనవసరంగా కమిషన్ల కోసం కొత్త రెగ్యులేటర్ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. గోప్లాపూర్ పంప్ హౌజ్ నుంచి 1000 క్యూసెక్కులు నీళ్లు సంగం బండ బూత్పూర్ రిజర్వాయర్లకు వెళుతున్నాయని వివరించారు.
భూత్పూర్ రిజర్వాయర్ కు ఒక టీఎంసీ నీళ్లు చేరుతాయని దీని ద్వారా ఏ విధంగా కొడంగల్కు ఏడు టీఎంసీలు నీళ్లు తీసుకువెళ్తారని ప్రశ్నించారు. అధికారులు అవగాహన లేకుండా పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే బీమా ప్రాజెక్ట్ కింద ఉన్న సంగం బండకు నీళ్లు కూడా చేరవని, బీమా ప్రాజెక్టు కింద ఉన్న ఐదు మండలాల భూములకు పూర్తిగా నీళ్లు అందక ఎడారి భూములుగా మారుతాయని, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ కు సులభంగా నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉందని సూచించారు.