కొల్లాపూర్ : నాగర్కర్నూల్ జిల్లా ( Nagarkurnool district ) కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగసాని యాదవ్ (45) హత్యకు ( Murder) గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల జూలై 29న జడ్చర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్( Kidnap) చేశారు. ఈ కేసులో కుటుంబ సభ్యులు కోడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దాదాపు 22 రోజులుగా దర్యాప్తు నిర్వహించారు.
తాజాగా, బల్మూరు మండలం మైలారం గ్రామ సమీపంలో ఆయనను హత్య చేసి పాత పెట్టినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ సంఘటనపై డీఎస్పీ, కోడేరు, అచ్చంపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కేసులో అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఏడుగురున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.
రంగసాని యాదవ్ను ఎందుకు కిడ్నాప్ చేసి హత్య చేశారన్న విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. వ్యాపార సంబంధిత తగాదాలు ఉన్నాయా? లేక ఇతర కారణాలున్నాయా? గుప్తనిధుల కోసం వెళ్లి బలయ్యాడా? అనే అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మైలారం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.