మహబూబ్నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరులో వలసలు, కరువు రక్కసిని పారద్రోలి.. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పదేండ్లు పాలించిన పాలనా దక్షుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజులపాటు రోడ్ షోలో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల రణరంగం షురూ అయిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించబోతున్నారు. శుక్ర, శనివారాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉండి రైతుల గోసను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు.
కేసీఆర్ చేపట్టబోయే రోడ్ షోకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కలిసి భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టనున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో పార్టీ అధినేత టూర్ను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రులు, పార్టీ నేతలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అధినేత రోడ్ షోలకు భారీ ఎత్తున జన సమీకరణను చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రోడ్ షోలను విజయవంతం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ రెండ్రోజుల పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నది. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడం, ఎలాగైనా పార్లమెంట్ స్థానాన్ని గెలవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈక్రమంలో కేసీఆర్ పాలమూరులో అడుగుపెడు తుండడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ అధినేత టూర్ కాంగ్రెస్, బీజేపీలో ఉత్కంఠను రేపుతున్నది.
కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో పాలమూరు పట్టణం గులాబీమయమైంది. పార్టీ నేతలు చౌరస్తాల వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలతోపాటు గులాబీ జెండాలను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిధి ప్రారంభమయ్యే షాద్నగర్ మొదలుకొని మహబూబ్నగర్ వరకు కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాగా జాతీయ రహదారి పొడవునా ఉద్యమ నేతకు నీరాజనం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
కేసీఆర్ బస్సు యాత్ర జడ్చర్ల నుంచి మొదలవుతుంది. పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డితోపాటు మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, అంజయ్యయాదవ్, పట్నం నరేందర్రెడ్డి కేసీఆర్కు స్వాగతం పలుకనున్నారు. అక్కడ నుంచి అభివాదం చేస్తూ భారీ ర్యాలీతో మహబూబ్నగర్లో అడుగుపెట్టనున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకోగానే లోక్సభ పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన జనం కేసీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.
భారీ ర్యాలీతో అప్పనపల్లి, ఏనుగొండ, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, మెట్టుగడ్డ, న్యూ టౌన్ బస్టాండ్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా కేసీఆర్ రోడ్ షో సాగుతుంది. అక్కడి నుంచి బస్సులో క్లాక్ టవర్కు చేరుకొని అక్కడ బీఆర్ఎస్ అధినేత జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మహబూబ్నగర్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ అనంతరం రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కేసీఆర్ బస చేస్తారు. ఇక్కడే పార్టీ నాయకులతో కలిసి ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్షిస్తారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వర్గాల ప్రజలతో కేసీఆర్ కలిసి మాట్లాడనున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పాలమూరును వలసల నుంచి విముక్తి చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోని వలస పోయే దుస్థితికి తీసుకొచ్చింది. కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోవడంతో కుంగిన అన్నదాతలతో కేసీఆర్ మాట్లాడనున్నారు. తిరిగి సాయంత్రం నాగర్కర్నూల్కు బయలుదేరుతారు. కేసీఆర్ రోడ్ షోలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ మంత్రు లు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.