బాలానగర్, ఫిబ్రవరి 16 : బాలానగర్ మండలం నేలబండతండా(వాల్యానాయక్)తండా.. ఈ తం డా పేరు వింటేనే 2008 ఏప్రిల్ 11న తెలంగాణ ఆత్మ గౌరవ రథయాత్రలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ పల్లె నిద్ర చేసిన సందర్భం టక్కున గుర్తొస్తుంది. పల్లెనిద్ర తర్వాత మరుసటి రోజు ఉదయమే వేప పుల్లతో పండ్లు తోముతూ తండాలో గులాబీ బాస్ పర్యటించారు. స్థానికుల సమస్యలను ఓపికతో ఆలకించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఎందరో వలస వెళ్లారని తెలుసుకొని ఆవేదన చెందారు. కుటుంబాలను వదిలి ముంబయి, ఇతర నగరాలకు పోయి బతికేటోళ్ల దీన గాథలు ఎన్నో ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, గిరిజన నేత వాల్యానాయక్తో కలిసి తండాలో రాజ్యమేలుతున్న సమస్యలు, ఉపాధి కరువై వలసలు పోతున్న గిరిజనుల బాధలను ఉద్యమ సూరీడికి వివరించారు. తండాలో మంచినీటి వసతి లేదు. వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి లేదు. అక్కడక్కడా బోర్లు, బావుల్లో నీళ్లున్నా సరైన కరెంట్ లేక పొలాలు ఎండే పరిస్థితి.. దీనికితోడు స్థానికంగా ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. చాలా వరకు ఉపాధి కోసం వలస వెళ్లారు. దీంతో స్థానికంగా కేవలం వృద్ధులు, చిన్న పిల్లలే దర్శనమిచ్చే పరిస్థితి ఉన్నదని తెలిపారు. వరకట్నం ఇవ్వాలనే భయంతో ఓ వితంతువు తన ముగ్గురు ఆడపిల్లలను విక్రయించిన సంఘటన తండా లో పర్యటించిన కేసీఆర్ దృష్టికి వచ్చింది. అప్పటికప్పుడే ఆ పిల్లలను తిరిగి తల్లివద్దకు చేర్చి వాళ్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయంగా బ్యాంకులో డిపాజిట్ చేయించారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక పేద ఆడబిడ్డల పెళ్లికి సాయం చేస్తా అని నాడే ప్రకటించారు.
అపన్ తండేమ.. ఆపనో రాజ్ పేరిట మన తండాలో మన రాజ్యం రావాలని కోరిన గిరిజనులకు అప్పుడే కేసీఆర్ అభయమిచ్చారు. మనకు ప్రత్యేక రాష్ట్రం ఎంత ముఖ్యమో.. తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ కూడా అంతే ప్రధానమని కేసీఆర్ నాడే చెప్పా రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలను ప్రత్యేక గ్రా మ పంచాయతీలుగా మారుస్తామని నేలబండతండా వేదికపై స్పష్టంగా ప్రకటించారు. చెప్పినట్లుగానే తెలంగాణ సిద్ధించాక జీపీలుగా మార్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,700 తండాలకు సర్పంచులు, సుమారు 25 వేల వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు.