మహబూబ్నగర్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లెలు పచ్చని హరితవనాలుగా మారాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. గ్రామాల్లో పచ్చదనం పరిఢవిల్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని అందించడం లేదు. మొక్కలు, చెట్లను సంరక్షించాల్సి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఎండాకాలం ప్రారంభానికి ముందే వనాలపై ఆలనాపాలన లేకుండాపోవడంతో ఎక్కడికక్కడే ఎండిపోతున్నాయి. బోర్డులు మాత్రమే మిగులుతున్నాయి. నీటి కొరత.. పర్యవేక్షణ కొరవడడంతో ధ్వంసమవుతున్నాయి.
కొన్ని చోట్ల ఎండిపోయి కాలిపోతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోగా.. కనీసం పట్టించుకోవడం లేదు. గతంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది సమిష్టిగా పనిచేస్తూ మొక్కలను రక్షించారు. కేసీఆర్ సర్కా రు గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి ఖాళీ జా గాల్లో మొక్కలు నాటేందుకు వీలుగా నర్సరీలను ఏ ర్పాటు చేశారు. ఎకరం, అర ఎకరం.. రెండెకరాలు ఎ లా ఉంటే అలా పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూ ములను గుర్తించి పల్లె ప్రకతి వనాలను సృష్టించారు. మండలాల్లో 10, 15 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లెప్రకృతి వనాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్ర స్తుతం ఎక్కడికక్కడే ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. నీటి కొరత ప్రధాన సమస్యగా మారింది. మహబూబ్నగర్ జిల్లాలో 655 పల్లె ప్రకృతి వనాలు, నాగర్కర్నూల్ జిల్లాలో 662, జోగుళాంబ గద్వాల జిల్లాలో 296, నారాయణపేట జిల్లాలో 254, వనపర్తి జిల్లా లో 312 చోట్ల ప్రకృతి వనాలు నిర్మించారు. ఒక్కో వనానికి రూ.4 లక్షలు ఖర్చు చేశారు. రెండు నెలల వరకు పచ్చదనంతో ఉన్న ఈ వనాలన్నీ ఇప్పుడు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.
పల్లెప్రకృతి వనాలకు గడ్డు కాలం ఏర్పడింది. కొన్ని చోట్ల స్వచ్ఛందంగా కొందరు భూములు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. మరికొన్ని గ్రామాల్లో పట్టణాలను తల దన్నేలా పోటీ పడి సిద్ధం చేశారు. కానీ నేడు అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లేక పచ్చదనం కొరవడుతున్నది. రేవంత్ సర్కారు సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రకృతి వనాలకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని స్వయంగా తాజా మాజీ సర్పంచులే చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులను నియమించినా చాలామంది గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జీపీలకు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితులు తలెత్తాయి. గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిశాక గ్రామ కార్యదర్శులు పంచాయతీ భారం మోయలేకపోతున్నారు. స్పెషల్ ఆఫీసర్లు చెప్పినట్లు నడుచుకునే వీలుండటంతో వాళ్లు రావడం లేదు.. వీళ్లు పట్టించుకోవడం లేదన్న చందంగా తయారైంది.
గత డిసెంబర్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్నీ తలకిందులయ్యాయి. కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడంతో పాలన అటకెక్కింది. ప్రత్యేక అధికారులను నియమించినా వారు పట్టించుకోకపోవడంతో మొక్కులు ఎండిపోతున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో నీటి కొరత వెంటాడుతోంది. అవసరానికి సరిపడా నీళ్లు లభించడం లేదు. విద్యుత్ కోతలు, మోటర్లు కాలిపోవడంతో వాటి రిపేర్లకు డబ్బులు ఎవరిస్తారని పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేశారు. దీంతో మొక్కలకు నీళ్లు పట్టకపోవడంతో ఇటు వనాలు, అటు నర్సరీలన్నీ దెబ్బతిన్నాయి.
ప్రతి వర్షాకాలంలో గ్రామాలు, మండలాలు, జిల్లాలో ఏటా లక్షల మొ క్కలను నాటుతూ హరితహారం కార్యక్రమాన్ని కేసీఆరర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ మొక్కలను కొనుగోలు చేసే బదులు కొంత ఖర్చు చేసి ఇక్కడే ప్లాంట్ తయారు చేయడమే కా కుండా.. పల్లెల్లో కూడా పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పల్లెప్రకతి వనాలకు శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనంతోపాటు గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ జాగాల్లో మొక్కలు నాటేందుకు ఇవి దోహదపడ్తున్నాయి. దీంతో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చుచేసి వీటిని నిర్మించింది. వీటి నిర్వహణ మూడు, నాలుగేళ్లుగా సాఫీగా సాగింది. గ్రామాల్లో అవసరమైన మొక్కలను పెంచి ఇవ్వడమే కాకుండా పల్లెల్లో పచ్చదనానికి దోహదపడ్డాయి. కాగా నెల రోజుల నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. దీంతో ప్రకృతి వనాలను సంరక్షించాల్సిన అధికారులు గ్రామాల్లోకి సక్రమంగా రావడం లేదు. దీంతో పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడే ఎండిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. వచ్చే వానకాలం హరితహారానికి లక్షల్లో మొక్కలు కావాల్సి ఉంది.. వీటిని ఎక్కడ.. ఏ విధంగా సమకూరుస్తారో అధికారులకే తెలియాలి.
ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు కలెక్టర్లు ప్రతిసారి పల్లెప్రగతిపై సమీక్షలు నిర్వహించినా కిందిస్థాయి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ సర్కారు చేపట్టిన ఏ కార్యక్రమానికి కూడా సహకరించొద్దని ఆదేశాలు రావడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడం పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్లెప్రకతి వనాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకొని వనాలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకుంటే పల్లెల్లో పచ్చదనం కరువయ్యే పరిస్థితులు దాపురించడం ఖాయం
మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం దేశాయిపల్లిలో మూడేండ్ల కిందట అర ఎకరం భూమిలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం సైతం అదే పరిస్థితి. ఇక్కడ దాదాపు 2 వేల మొక్కలను నాటగా ఏపుగా పెరిగాయి. రెండేండ్ల పాటు ఎన్ఆర్ఈజీఎస్ వీటి నిర్వహణ తీసుకొని సంరక్షించింది. నెల రోజులుగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు సంరక్షణ బాధ్యతలు చేపట్టినా ఎక్కడా చెట్లకు నీళ్లు పట్టిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో 90 శాతం చెట్లన్నీ ఎండిపోయాయి.
నారాయణపేట జిల్లాలోని పర్మాన్దొడ్డిలోని నర్సరీలో నీళ్లు లేక ఎండిపోవడమే కాకుండా నర్సరీల్లో ఏపుగా పెరిగిన మొక్కలు కాలిబూడి దయ్యాయి. వర్కూరు, ఉజ్జల్లి, నేరుడుగం పల్లె ప్రకృతి వనాలు కూడానెలరోజులకే ఆనవాళ్లు లేకుండాపోయాయి.