మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 19 : మానవ మనుగడకు చెట్లే ఆధారమని, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని శిల్పారామం వద్ద నిర్వహించిన హరితోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు మ హబూబ్నగర్లో 500 గజాల పార్కు ఉండేది కాదని, ప్రస్తుతం దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. 2087 ఎకరాల విస్తీర్ణం కలిగిన పార్కులో జంగల్ సఫారీతోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే శిల్పారామం, మినీ ట్యాంక్బండ్, నక్లెస్రోడ్డు వంటి నిర్మాణాలు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. వీటన్నింటినీ విద్యార్థులు ఉచితంగా తిలకించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
రెండునెలల్లో సస్పెన్షన్ బ్రిడ్జి, మినీ ట్యాంక్బండ్ తదితర పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా మహిళలు తయారు చేసిన విత్తన బంతులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రావడం అభినందనీయమన్నారు. పుట్టినరోజు ఇతరత్రా వేడుకల సందర్భంగా మొక్కలు నాటి సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పలువురికి మె మెంటోలు అందజేసి సన్మానించారు. వివిధ పోటీల్లో ప్ర తిభకనబర్చిన 12మంది విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, కలెక్టర్ జి.రవినాయక్, అదనపు కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షితిజ, డీఎఫ్వో సత్యనారాయణ, డీఆర్డీవో యాదయ్య, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ నటరాజ్, ఎకో క్లబ్ అధ్యక్షుడు గన్నోజు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పాలమూరుపై విషం కక్కేటోళ్లకు గుణపాఠం చెప్పాలి
జడ్చర్ల టౌన్, జూన్ 19 : పచ్చబడిన పాలమూరును చూసి ఓర్వలేక కొందరు విషం కక్కుతూ జిల్లాను నాశ నం చేయాలని చూస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జడ్చర్లలోని జిల్లా పోలీసు శిక్షణాకేంద్రంలో ఏర్పాటు చేసిన హరితోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి పాల్గొని నర్సరీని ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను ఆగం చేసినోళ్లు.. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆగమవుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే అత్యధికంగా గ్రీనరీ తెలంగాణలోనే పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు. దేశం లో 96శాతం ప్రజలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యాసంగిలో 96 లక్షల ఎకరాల్లో ధాన్యం పండితే, తెలంగాణలో 56లక్షల ఎకరాల్లో పంట పండినట్లు తెలిపారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తే బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఒకప్పుడూ వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా.. వ్యవసాయం, పారిశ్రామికరంగం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ నంబర్వన్ అయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జోగుళాంబ జోన్ రేంజ్ డీఐజీ ఎస్కే. చౌహాన్, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ కె.నర్సింహ్మ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్కుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ సీఈవో జ్యోతి, మున్సిపల్ చైర్మన్ దోరేపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.