కేటీదొడ్డి, ఏప్రిల్ 4: కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే క్రమంలో తెలంగాణలో అనుమతి లేకపోవడంతో విషయం కాస్త ఎస్సై వెంకటేశ్కు తెలిసింది.
వెంటనే ఎస్సై తన సిబ్బందితో సభాస్థలికి చేరుకొని సభను బహిష్కరించారు. విషయం బయటకు పొక్కడంతో సభకు రావాల్సిన రాయిచూర్ బీజేపీ ముఖ్య నాయకుడు వెనుదిరిగారు. దీంతో సభ నిలిచిపోయింది. కాగా కర్ణాటక సరిహద్దులోని గ్రామాల నాయకులు తాము అక్కడున్న అమ్మవారిని పూజించి.. దావత్ చేసుకోవడానికి వచ్చామని చెప్పగా వారికి ఎస్సై తినడానికి అనుమతివ్వడంతో భోజనం అనంతరం కర్ణాటకకు వెళ్లారు. ఈ విషయంపై గద్వాల డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్ కేటీదొడ్డి పీఎస్కు వచ్చి వివరణ తీసుకున్నారు.