అలంపూర్, మార్చి 8 : ఓం నమశ్శివాయ.. హరహర మహాదేవ.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణతో అలంపూర్ క్షేత్రం మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగోద్భ వ కాలంలో బోళా శంకరుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం శనివారం తెల్లవారుజామున జోగుళాంబ ఆలయం ఎదుట రాజగోపురం పరిసరాల్లో ఆది దంపతుల కల్యాణం కనుల పండువ గా నిర్వహించారు. చారిత్రక ప్రసిద్ధిగాంచిన సంగమేశ్వర ఆలయం, నవబ్రహ్మాలయాలు, జోగుళాం బ ఆలయం, కోటిలింగాలలో కొలువైన అలంపూరు క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో శోభిల్లాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ సంతోష్ దంపతులు, స్థానిక కోర్టు జడ్జి కమలాపురం కవిత తదితరులు దర్శించుకున్నారు. మహా కుంభాభిషేకంలో భా గంగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ శిఖరంపై గల కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కలశాన్ని అభిషేకించారు. కుంభాభిషేక మహోత్సవం ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహిస్తారని, కుంభాభిషేకం విశిష్టత, ప్రత్యేకత, ఫలితాలు తదితర అంశా ల గురించి బ్రహ్మశ్రీ అవ్వారి శ్రీనివాసశర్మ భక్తులకు వివరించారు. సంగమేశ్వర ఆలయం, నవ బ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వర ఆలయం పైభాగంలో శివస్వాములచే ఆకాశ జ్యోతి కార్యక్రమం శుక్రవారం రాత్రి 12గంటలకు నిర్వహించారు. ఆకాశమార్గాన వెళ్తున్న జ్యోతికి భక్తులు జేజేలు పలికారు.
మహా శివరాత్రిని పురస్కరించుకుని లింగోద్భోవ కాలంలో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వర కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పురేందర్కుమార్, ఆలయ పాలక మండలి సభ్యులు, పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.