పాలమూరు, మే 6 : పాలమూరు పట్టణం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందిందని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మంత్రి కేటీఆర్ హాజరై మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి అప్పన్నపల్లిలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్ సఫారీని ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ రవినాయక్ ఇతర అధికారులతో కలిసి ఆయన అడవిలో సఫారీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని నిర్వహించడం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఉదయం మండుటెండలో తిరిగి పార్కుకు వచ్చాక ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా ఉందని మంత్రి తెలిపారు. పార్కులో అడ్వెంచర్ కార్యక్రమాలతో పాటు పిల్లలు, పెద్దలందరికీ ఆహ్లాదం, వినోదం కలిగించేలా ఏర్పాట్లు చేయడంపై మంత్రి శ్రీనివాస్గౌడ్ను అభినందించారు. అనంతరం వారు అడవిలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన గోల్బంగ్లా స్థానంలో పునరుద్ధ్దరించిన బంగ్లాను సందర్శించి అక్కడ మ్యాప్ ద్వారాఅటవీ విస్త్తీర్ణాన్ని తిలకించారు. అంతేకాకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్కు గురించి మంత్రి కేటీఆర్కు వివరించారు. మయూరి నర్సరీగా ఉన్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును 2,097 ఎకరాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నక్షత్ర వాహనాలు, చిల్డ్రన్స్పార్కు, అడ్వెంచర్ కార్యక్రమాలు, రాత్రి టూరిస్టులు బస చేసేందుకు టెంట్లు, బోటింగ్, సైక్లింగ్, రెయిన్ ఆక్టివిటీస్ వంటివి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అటవీ విస్తీర్ణంగా ఉన్నందునా సఫారీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, సీపీఎఫ్ క్షితిజ, డీఎఫ్వో సత్యనారాయణ, ఆర్డీవో అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.