జడ్చర్లటౌన్, ఆగస్టు 22 : పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కావటంతో జడ్చర్ల నియోజకవర్గంలోని 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజ్-16లో జరుగుతున్న సర్జిపూల్ పంప్హౌస్, అప్రోచ్ కెనాల్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు చివరిదశలో ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని 12.30 లక్షల ఎకరాలకు నీళ్లు అందించటమే కాకుండా హైదరాబాద్ నగరానికి తాగునీరు కూడా అందిస్తుందని వివరించారు. ఆయన వెంట జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచులు, నాయకులు ఉన్నారు.