అలంపూర్/వడ్డేపల్లి, అక్టోబర్ 18: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు జోగుళాంబ అమ్మ వారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు నిత్యపూజల్లో భాగంగా యాగశాలలో హోమాలు, బలిహరణం, కుంకుమార్చనలు సందర్భానుసారంగా నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించారు. అనంతరం సాయంత్రం వరకు సహస్రనామార్చనలు నిర్వహిస్తూ భక్తులకు సర్వ దర్శనం కల్పించారు. 6గంటల తర్వాత అమ్మవారికి మహా మంగళహారతి, దశవిద హారతులు ఇచ్చారు. రాత్రి 7గంటల సమయంలో జోగుళాంబాదేవి కూష్మాండదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ పరిసరాల్లో, మండల పరిధిలోని క్యాతూర్ ఆరోగ్య కేంద్రం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసింది. డాక్టర్ తరుణ్, హెల్త్ అసిస్టెంట్ బాలీశ్వరయ్యశెట్టి, ఏఎన్ఎంలు హైమావతి, ఫార్మసిస్ట్ శంకర్, ఆశా కార్యకర్తలు పద్మ, చిట్టెమ్మ పాల్గొన్నారు.
శాంతినగర్లో సోమవంశ సహస్రార్జున క్షత్రియఖత్రి సమాజ్ వారి ఆధ్వర్యంలో అమ్మవారిని లలితాదేవిగా అలంకరించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు లలితాంబికాదేవిగా దర్శనమిచ్చారు. మహిళలు సద్దుల బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం చేశామని దేవస్థాన కమిటీ తెలిపింది.