పాల్గొన్న భూసేకరణ అదనపు కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్కుమార్
జడ్చర్ల, జూలై 27: ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపుబాధితుల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అర్హుల జాబితాపై బుధవారం ఉదండాపూర్ గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణకు భూసేకరణ అదనపు కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్కుమార్ హాజరయ్యారు. జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ గ్రామం వద్ద రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా రిజర్వాయర్ను నిర్మిస్తున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఉదండాపూర్ గ్రామానికి చెందిన భూములతోపాటు ఉదండాపూర్ పూర్తిగా ముంపునకు గురవుతున్నది. ముంపు గ్రామస్తులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్నది. ఇప్పటికే గ్రామంలో అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి ఇండ్లకు యూబీఆర్ నంబర్లు కేటాయించారు.
ఈ సర్వేలో ఇంటి యజమానితోపాటు ఇంట్లో ఎంతమందికి పెండ్లిళ్లు అయ్యాయి..18సంవత్సరాల వయస్సు ఉన్నవారు.. మైనర్లు, గ్రామంలో నివసించి వలసలు వెళ్లినవారు తదితర వివరాలను సేకరించి మొత్తం 1692మందికి సంబంధించిన లిస్టును తయారు చేశారు. అందులో అర్హులు ఎవరూ అనే విషయమై గ్రామంలో అధికారులు బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జాబితాలో ఉన్న వారి పేర్లను అధికారులు. బహిరంగంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరి సమక్షంలో తొలగింపునకు సంబంధించి రెడ్మార్కు చేసుకున్నారు. విచారణ రాత్రివరకు కొనసాగింది. సమావేశంలో సర్పంచ్ సువర్ణ, తాసిలార్లు లక్ష్మీనారాయణ, రుద్రప్ప, ఆర్ఐలు రాఘవేంద్ర, సలావుద్దిన్, మాజీ ఎంపీటీసీ శంకరయ్య, హబీబ్, హన్మంతు, మాజీసర్పంచ్ వెంకటయ్య, మాజీ వార్డుసభ్యులు సుభాష్గౌడ్ ఉన్నారు.