లింగాల, జనవరి 30 : మండలంలోని పద్మన్నపల్లి గ్రామ చెంచు కాలనీలో వారం రోజులుగా తాగునీరు లేక చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం కిందట కాలనీలో ఉన్న బోరు మోటరు కాలిపోయినట్లు వీటీడీఏ అధ్యక్షుడు సలేశ్వరం తెలిపారు. ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి విన్నవించినా పట్టించుకోవడం లేదని చెంచులు వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రతి రోజూ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాలకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
వ్యవసాయ పొలాల్లో ఉన్న నీటిని తాగుతూ అనారోగ్యం పాలై దవాఖానకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమకు వ్యవసాయ పనులకు వెళ్దామంటే నీటిని తెచ్చువకోవడానికే టైం సరిపోతుందని ఆవేదన వ్య క్తం చేశారు. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకొని కాలిపోయిన బోరు మోటరుకు మరమ్మతులు నిర్వహించి తాగునీ టి ఎద్దడిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చెంచులు కోరుతున్నారు.