నారాయణపేట, సెప్టెంబర్ 13 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా దేశంలోనే గుర్తింపు. కాళేశ్వరం లిఫ్ట్ తర్వాత అంత పేరున్నదని ఈ ప్రాజెక్టుకే.. ఐదు రిజర్వాయర్లు.. నార్లాపూర్, వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి(వట్టెం), కురుమూర్తిరాయ(కరివెన), ఉదండాపూర్ జలాశయాలను నిర్మించారు. వీటికి అనుబంధంగా సర్జ్పూల్స్, పంప్హౌస్లు, మహాబాహుబలి మోటర్లు, టన్నెళ్లు.. కాల్వ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత వివరించినా తక్కువే.. అంత భారీ ప్రాజెక్టు ఫలాలు త్వరలో అందనున్నాయి. త్వరలో జలస్వప్నం సాకారం కానున్నది.
నారాయణపేటకు కృష్ణమ్మ
నాడు వలసలకు కేరాఫ్గా ఉన్న నారాయణపేట జిల్లా త్వరలో సాగునీటి రాకతో పంటలకు నిలయంగా మారనున్నది. గతంలో సాగునీటికి అవకాశం లేని జిల్లాలో కృష్ణమ్మ పరుగులు పెట్టనున్నది. ఉపాధి లేక, సాగునీరులేక అల్లాడుతున్న సమయంలో ఊహించని విధంగా సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ భగీరథుడిలా మారారు. వలసలకు చరమగీతం పాడాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్ట్కు డిజైన్ చేయించారు. 2015లో ఈ ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. నాటి నుంచి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేసినా.. వాటిని అధిగమిస్తూ పనులు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే 95 శాతం పూర్తి కావడంతో కొద్దిరోజుల్లోనే అందరి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చొరవతో జిల్లాలో సాగునీరు పారించేందుకు అడుగులు పడుతున్నాయి.
కరివెన, ఉదండాపూర్ నుంచి సాగునీరు
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పెద్ద ప్రాజెక్టులైన కరివెన (19టీఎంసీలు), ఉదండాపూర్(16 టీఎంసీలు) రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి కాల్వలు తీసి సాగునీటిని నారాయణపేట జిల్లాలో పారించనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుండగా ఒక నారాయణపేట జిల్లాలోనే 1,02,485 ఎకరాల్లో జలాలు పారనున్నాయి. పేట నియోజకవర్గంలో 36,028 ఎకరాలకు, మక్తల్ నియోజకవర్గంలో 66,457 ఎకరాలకు అందించేలా డిజైన్ చేశారు. కురుమూర్తి రాయ రిజర్వాయర్ నుంచి జిల్లాలోని 65 శాతం గ్రామాలకు, అలాగే ఉదండాపూర్ నుంచి మద్దూరు కెనాల్ ద్వారా 35 శాతం గ్రామాలకు సాగునీరు అందనున్నది. నారాయణపేట కాల్వతో ధన్వాడ, మరికల్, నారాయణపేట, ఉటూర్ మండలాలతోపాటు నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ మండలానికి నీరు అందనున్నది. మద్దూరు కాల్వ ద్వారా కోయిలకొండలోని ఐదు గ్రామాలకు, దామరగిద్ద మండలంలోని 20 గ్రామాలకు, నారాయణపేట మండలంలోని 6 గ్రామాల్లో జలాలు పరవళ్లు తొక్కనున్నాయి.
వలసలు వాపస్
వలసలకు పేరొందిన నారాయణపేట జిల్లాకు వలసలు వాపస్ వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఉపాధి లేక సుదూర ప్రాంతాలైన ముంబయి, పుణె, ఇతర నగరాలకు బతుకు దెరువు కోసం పొట్ట చేతబట్టుకొని వేల సంఖ్యలో వెలసవెళ్లారు. కేవలం రైతులు వర్షాధారంపై ఆధారపడి మాత్రమే పంటలు పండించేవారు. దీంతో పెద్ద మొత్తంలో వలస బాటపట్టారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో ఉపాధి అవకాశాలు మెరగవడం.. సాగు, తాగునీరు పుష్కలం కావడం.. చెరువులకు జలకళ రావడం.. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం.. రైతు సంక్షేమానికి నిరంతరం పాటుపడుతుండడంతో ఊళ్లల్లోనే ఉపాధి పెరిగింది. వ్యవసాయం పండుగలా సాగుతున్నది. గ్రామీణ ప్రాంతాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. కులవృత్తులకు పునర్జీవం వచ్చింది. సొంతూళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా జీవించే అవకాశం దొరికింది. దీంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతం వలస కార్మికులు తిరిగివచ్చినట్లు అంచనా.. ఇక పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తయ్యి సాగునీరు పారితే బీడు భూముల్లో కృష్ణమ్మ సందడి చేయనున్నది. పొలాలన్నీ పచ్చని మాగాణుల్లా దర్శనమివ్వనున్నాయి. సాగు విస్తీర్ణం పెరగనున్నది. రైతు మరింత బిజీబిజీగా మారనున్నాడు. కూలీలకు చేతినిండా పని దొరకనున్నది.
రైతుల్లో పెరిగిన నమ్మకం
పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కానుండడం.. త్వలో కృష్ణమ్మ జలసవ్వడి చేయనుండడంతో సాగుకు మంచిరోజులు రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాళేశ్వరం జలాలతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కావడంతో.. నేడు పెద్దదైన పాలమూరు లిఫ్ట్తోనూ సాగునీరు పుష్కలం కానున్నది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పనులు చేయిస్తుండడంతో త్వరలో జలకల సాకారం కానున్నదని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను చూసి మున్ముందు మరిన్ని మంచిరోజులు రానున్నాయని పేర్కొంటున్నారు.
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి చొరవతో..
పాలమూరు సాగునీరు నారాయణపేట జిల్లాకు చేరేందుకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఎంతో కృషి చే శారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా రు. స్వయంగా ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి ప్రతి మండలంలోని రైతులను ప్రత్యేక బస్సుల్లో కరివె న రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి స్వయం గా చూయిస్తున్నారు. ఇంత త్వరగా పె ద్ద మొత్తంలో జరిగిన ప నులను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే సా గునీరు అందనున్నదని ఆ నందంగా చెబుతున్నారు.
ఎన్నో ఏండ్ల కల నెరవేరనున్నది..
ఎప్పుడెప్పుడు నారాయణపేట నియోజకవర్గానికి సాగునీళ్లు తీసుకురావాలనే కల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నేరవేరబోతున్నది. ముఖ్యమంత్రి భరోసా, ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఇది సాధ్యం కాదని కొందరన్నారు. మరికొందరు కేసుల పేరుతో పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఒకొకటిగా అధిగమించి 95శాతం పనులు పూర్తి చేసుకున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని మేము అప్పట్లో చెబితే ప్రతిపక్షాలు నమ్మకపోగా విమర్శించారు. ఈక్రమంలో ఐదేండ్లుగా విరామం లేకుండా ప్రతి రోజూ ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దకింది. అదేవిధంగా ప్రతి గుంటకూ సాగునీరు అందిస్తాం. ఈ నెలలో టెండర్లు పూర్తి చేసి కాల్వ పనులను సైతం ప్రారంభిస్తాం. 25వ తేదీ నుంచి ఐదురోజుల పాటు ఇంజినీర్లను వెంటబెట్టుకొని నియోజకవర్గంలో పర్యటిస్తాం. దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లి వద్ద లేదా లోకుర్తి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో నియోజకవర్గ ప్రజల జీవితాలు ధన్యం కావడంతోపాటు భూములన్నీ సస్యశ్యామలం అవుతాయి.
– ఎస్.రాజేందర్రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట
‘జయమ్మ చెరువు ’కష్టాలు తీరుతాయి..
నారాయణపేట మండలం పేరపళ్ల జయమ్మ చెరువు పూర్తిస్థాయిలో వర్షాలు కురిస్తేనే నిండుతుంది. అంతంత మాత్రం కురిస్తే మాత్రం నిండే పరిస్థితి లేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కాల్వల ద్వారా అన్ని చెరువులను నింపినట్లుగానే జయమ్మ చెరువు కూడా నింపుతామంటున్నరు. అదే జరిగితే చెరువులో పుష్కలంగా నీరుండి రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటది. ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలమై మా కష్టాలు తీరుతయ్. మాలాంటి వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇదో చక్కటి అవకాశం.
– కనకప్ప, రైతు, పేరపళ్ల
వలసలు తగ్గుతయ్..
70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదు. దీంతో ఊర్లలో ఉపాధి లేక వివిధ ప్రాంతాలకు రైతులు కూలీలుగా వలసెళ్లారు. స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు సాగుకు పెద్దపీట వేసింది. వ్యవసాయానికి పెట్టుబడి ఇచ్చి పంటలను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడంతో వలసలు వాపస్ అయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమయ్యాక ప్రతి గ్రామానికి సాగునీరు అంది చేతినిండా పని దొరుకుతుంది.
– శివారెడ్డి, రైతు, అప్పక్పల్లి, నారాయణపేట మండలం