బిజినేపల్లి, నవంబర్ 24: రైతాంగానికి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, పంట పొలాలకు సాగునీరు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించడం జరిగిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గుడ్లనర్వ, పాలెం, ఖానాపూర్, బోయాపూర్, మహాదేవునిపేట, బిజినేపల్లి, సలర్పేట, వడ్డేమాన్, అల్లిపూర్, మామ్మాయిపల్లి, సాయిన్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందించినట్లు చెప్పారు. గత పాలకుల హయాంలో రైతులు ఎరువులు విత్తనాల కోసం పోలీస్ స్టేషన్లో లైన్లో నిలబడి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయని, కానీ సీఎం సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో పుషలం గా ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచిందన్నారు. ఎన్నికలు అయిపోయిన వెంబడే బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. నాటికి నేటికి నాగర్కర్నూల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గతంలో పంట పొలాలకు సాగునీరు లేక వర్షాధారంపైనే రైతులు పంటలు సాగు చేసుకునేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాల్వలు తీసి వదిలి పెట్టడం జరిగిందని, ఎలాగైనా రైతులకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో కాల్వల వెంబడి పాదయాత్ర నిర్వహించి రూ.2వేల కోట్లు నిధులతో ఎంజీకేఎల్ఐ కాల్వను పూర్తి చేసి పంటలకు నీరు అందించడం జరిగిందన్నారు.
అంతకుముందు పంట పొలాలకు సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకునేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ట్రస్టు ద్వారా పేదవారికి పెళ్లిండ్లు, ఐదు రూపాయల భోజనం, ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహించడం జరిగిందని వివరించారు. సుబ్బయ్యను ఆదర్శంగా తీసుకొని పాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. పాలెం గ్రామంలో గల చెరువును మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసి చెరువు మధ్యలో సుబ్బయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. రూ.రెండు కోట్లతో గ్రామంలో పాఠశాలను నిర్మించడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలు అభివృద్ధి చేసే బీఆర్ఎస్ నాయకులను ఎన్నుకోవాలని, నాగర్కర్నూల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మర్రికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగం శశిధర్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, మాజీ మారెట్ చైర్మన్ కుర్మయ్య, సింగిల్ విండో చైర్మన్ బాలరాజ్గౌడ్, లావణ్య నాగరాజు, పులేందర్రెడ్డి, మహేశ్రావు, విజయ్, బాలస్వామి, మహేశ్వర్రెడ్డి, మల్లికార్జున్, చెన్నయ్య, రఘుమారెడ్డి, శ్రీశైలం, సుదర్శన్గౌడ్, రాజేశ్, కృష్ణ, మల్లికార్జున్, వెంకటయ్య, మాసయ్య, కల్యాణి, రాజేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.