వరప్రదాయినీగా ఉదండాపూర్ మారనున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో సింహభాగం ఆయకట్టు ఈ రిజర్వాయర్ పరిధిలోనికే వస్తుంది. 9 లక్షల ఎకరాలకు ఇక్కడి నుంచే గ్రావిటీ ద్వారా సాగునీరు అందనున్నది. ఈ రిజర్వాయర్ కిందే ప్రాజెక్టు మొత్తం ఆయకట్టులో దాదాపు 75 శాతం ఉండ టంతో కీలకంగా మారనున్నది. శ్రీశైలం నీటిని సుమారు 672 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాజెక్టుకు తరలించడంపై సర్కారుది ఉద్దండ ఆశయంగా చెప్పొచ్చు. రూ.6,500 కోట్లతో చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. 16 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తుండగా.. సర్జ్పూల్ 122 మీటర్ల భూగర్భంలో.. ఎత్తు 92 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, పొడవు 233 మీటర్లతో నిర్మిస్తున్నారు. సొరంగం ద్వారా వచ్చిన నీటిని పంప్హౌస్లోకి తరలించే గేట్ల పనులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల్లో వెట్న్న్రు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నుంచి తరలివచ్చేందుకు కృష్ణమ్మ ఉవ్విళ్లూరుతున్నది. దీంతో వలస జిల్లాగా ఉన్న పేరు తొలగి.. సాగు జిల్లాగా మారనున్న మంచిరోజు ఎంతో దూరంలో లేదు.
– జడ్చర్ల, సెప్టెంబర్ 11
జడ్చర్ల, సెప్టెంబర్ 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఉదండాపూర్ రిజర్వాయర్తో 9లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు, పరిశ్రమలకూ నీరు అందనున్నది. పీఆర్ఎల్ఐకి 2016 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరును సాగునీటితో సస్యశ్యామలం చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాతోపాటు నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని దాదాపు 9లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతో ఐదుజిల్లాల్లో సాగునీటి కష్టాలు తీరి సస్యశ్యామలం కానున్నాయి. పీఆర్ఎల్ఐ నుంచి వచ్చే 75శాతం నీళ్లు ఈ రిజర్వాయర్ ద్వారానే ఇతర ప్రాంతాలకు తరలనున్నాయి. ఈక్రమంలో ఉదండాపూర్ రిజర్వాయర్ జిల్లాకే తలమానికంగా మారనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సాగునీరు అందనుంది. ఉదండాపూర్ రిజర్వాయర్ పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
కృష్ణానదీ జలాలను ఎత్తిపోయడం పీఆర్ఎల్ఐ ముఖ్య ఉద్దేశం. కృష్ణా జలాలు జిల్లా మీదుగా పారుతున్నా గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్ఎల్ఐని తీసుకొచ్చి ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటిని అందించనున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్ద శ్రీశైలం బ్యాక్వాటర్ను నార్లాపూర్ రిజర్వాయర్కు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపి ఆ తర్వాత ఉదండాపూర్కు నీటిని పంపింగ్ చేయనున్నారు. కరివెన రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కెనాల్, టన్నెల్ ద్వారా ఉదండాపూర్కు కృష్ణమ్మ తరలిరానున్నది. కరివెన నుంచి 0.290 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, ఆ తర్వాత 8.645కిలోమీటర్లు రెండు టన్నెల్ల గుండా కృష్ణమ్మ ఉదండాపూర్ను చేరుకోనుంది. ఇక్కడ ఓపెన్ కెనాల్ తక్కువగా ఉండి టన్నెల్ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత సర్జిపూల్ నుంచి పంప్హౌస్ ద్వారా 5 మోటర్లు 122మీటర్ల ఎత్తుకు ఎత్తి ఉదండాపూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్లోకి పోస్తాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ను 16టీఎంసీల సామర్థ్యంతో 16కిలోమీటర్ల కట్టను నిర్మించారు. ఈ రిజర్వాయర్ ఎడమ ప్రధాన కాలువ 120 కిలోమీటర్లు ఉంది.
ఈ కాల్వ ద్వారా వికారాబాద్ జిల్లాలోని 2.70లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ కాలువ 16.5 కిలోమీటర్ల వద్ద మరో రెండు కాలువలు తీయనున్నారు. 90 కిలోమీటర్ల మేర ఉన్న మద్దూర్ కాల్వ ద్వారా 1.74లక్షల ఎకరాలకు, మరో కాల్వ హన్వాడ వరకు, ఇంకో 20 కిలోమీటర్ల పొడవైన కాల్వ ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 27వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. మొదటి కుడి కాల్వ ద్వారా 9వేల ఎకరాలకు, రిజర్వాయర్ నుంచి 100కిలోమీటర్ల దూరంలో మొదటి, రెండవ కెనాల్స్ ద్వారా రంగారెడ్డి జిల్లాలోని 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ లేకపోవడంతో ఉదండాపూర్ నుంచే నీటిని వదిలే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పరిధిలోకి రాని, ఎక్కువ ఎత్తులో ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఉదండాపూర్ నుంచి వెళ్లే ప్రధాన కాల్వలపై లిఫ్టులు ఏర్పాటు చేయనున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,100 చెరువులను నింపి సాగు, తాగునీటికి వినియోగించనున్నారు. మొత్తంగా ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా 9లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
ఒకప్పుడు వలస జిల్లాగా ఉన్న పాలమూరును ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చటి పంటపొలాలతో కళకళలాడేలా చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఇది పూర్తయితే పాలమూరు సాగు జిల్లాగా మారనున్నది. ఇప్పటికే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో పాలమూరు ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే తీరనున్నది.
ఉదండాపూర్ రిజర్వాయర్ కరివెన కన్నా ఎత్తులో ఉండడం వల్ల కెనాల్ ద్వారా కాకుండా రెండు టన్నెళ్ల ద్వారా నీటిని తరలించనున్నారు. ఉదండాపూర్ ఎత్తులో ఉండటం వల్ల కరివెన రిజర్వాయర్ నుంచి కెనాల్స్ గుండా నీటి తరలింపు సాధ్యం కాదు. కాబట్టి కరివెన నుంచి ముందుగా అప్రోచ్ కెనాల్లోకి ఆ తర్వాత టన్నెళ్లలోకి పంపించి అక్కడి నుంచి రెండు టన్నెళ్ల ద్వారా 8.645 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉదండాపూర్ సర్జ్పూల్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి పంప్హౌస్ ద్వారా 122మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. టన్నెల్-2 కాంక్రీట్తోపాటు ఇతర పనులు పూర్తకాగా టన్నెల్-1 కాంక్రీట్ పనులు 60శాతం పూర్తయ్యాయి.
ఎన్నో ఏండ్లుగా సాగునీరు లేక వ్యవసాయ భూములన్నీ బీళ్లుగా మారాయి. దీంతో చాలా ఇబ్బంది పడ్డామని, ఉదండాపూర్ రిజర్వాయర్ పూర్తయితే సాగునీరు పుష్కలంగా లభిస్తుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మంచి నిర్ణయంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ తమ కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్తో భూగర్భజలాలు పెరిగి జడ్చర్ల ప్రాంతంలో నీళ్లు పుష్కలంగా లభించి సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరనున్నాయి.
ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్త్తున్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్లే బన్డక్ట్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఉదండాపూర్ వద్ద 5 లిఫ్టులకు 5మోటర్లతోపాటు ఒక స్పేర్ మోటర్ను ఏర్పాటు చేస్తారు. వీటికి సరిపడా విద్యుత్ సరఫరా అందించేందుకు సబ్స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం వట్టెం నుంచి ఒకలైన్, మహేశ్వర్ నుంచి మరోలైన్ను తీసుకొస్తుండగా అందుకు సంబంధించి టవర్లు, వైర్ పనులు పూర్తయ్యాయి.
ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న సర్జ్పూల్ 122 మీటర్ల లోతులో ఉంటుంది. ఇది 92మీటర్ల ఎత్తు, 20 మీటర్ల వెడల్పు, 233 మీటర్ల పొడవుతో నిర్మిస్తుస్తున్నారు. సొరంగం ద్వారా వచ్చిన నీటిని పంప్హౌస్లోకి పంపేందుకు గేట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. పంప్హౌస్, సర్జ్పూల్ సొరంగంలోనే నిర్మిస్తున్నారు. సర్జ్పూల్ వద్ద 60శాతం పనులు పూర్తయ్యాయి. పంపహౌస్ వద్ద 50శాతం పనులు పూర్తయ్యాయి.
ఉదండాపూర్ రిజర్వాయర్ను 5,500 వందల ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దాదాపు 16కిలోమీటర్ల పొడవున బండ్ (కట్ట)ను నిర్మిస్తున్నారు. ఇందులో 16 టీఎంసీల నీటిని నింపి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. పరిశ్రమలకు కూడా నీటిని వదలనున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ అత్యంత ఎత్తులో ఉన్నది. ఇది కాళేశ్వరం కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ నుంచి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వరకు (జీరో లేవల్ నుంచి 672మీటర్ల ఎత్తుకు) నీటిని తరలించనున్నారు. నార్లాపూర్ నుంచి లిఫ్టుల ద్వారా ఎత్తిపోసి అక్కడి నుంచి రిజర్వాయర్లకు పంపింగ్ చేస్తూ ఆ తర్వాత ఉదండాపూర్కు నీటిని పంపింగ్ చేయనున్నారు. ఉదండాపూర్ వద్ద నిర్మిస్తున్న సర్జ్పూల్, పంప్హౌస్ నుంచి 5 మోటర్ల ద్వారా 122మీటర్ల ఎత్తున ఉన్న ఉదండాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయనున్నారు.
ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద కట్ట(బండ)పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 70శాతం పనులు పూర్తి కాగా సొరంగంలో సర్జ్పూల్, పంప్హౌస్, పైప్లైన్ పనుల్లో వేగం పెంచారు. అండర్గ్రౌండ్లో సర్జ్పూల్లో షర్టర్ల పనులు జరుగుతుండగా పంప్హౌజ్ వద్ద బెడ్ వేస్తున్నారు. పంప్హౌస్ నుంచి మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోసే పైప్లైన్ వెల్డింగ్ పనులు వేగం పుంజుకున్నాయి. పంప్హౌస్ నుంచి రిజర్వాయర్లోకి ఎత్తిపోసే దగ్గర పంపింగ్ పైప్లైన్కు సంబంధించిన ఇన్టేక్ వెల్ పనులు కూడా జరుగుతున్నాయి. ఉదండాపూర్ రిజర్వాయర్ను త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు.
ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉన్నందున ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా వినియోగించని బాహుబలి మోటర్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. 145 మెగావాట్ల సామర్థ్యం గల మోటర్లు ఇక్కడ ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి పథకం ద్వారా అత్యధికంగా 12.30లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అందులో ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి 5 కెనాల్స్ ద్వారా 9లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
ఉదండాపూర్ రిజర్వాయర్, సర్జ్పూల్, పంప్హౌస్, టన్నెల్ పనులు చురుకుగా సాగుతున్నాయి. కరివెన నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్కు టన్నెల్ పూర్తికాగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. బండ్ పనులు 70శాతానికి పైగానే పూర్తయ్యాయి. సొరంగం పనులు పూర్తికాగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. పంప్హౌస్ నుంచి పైప్లైన్ పనులు నడుస్తున్నాయి. మోటర్లు, పంపులకు సంబంధించిన విడిభాగాలు వచ్చాయి. సబ్స్టేషన్ కోసం స్థలాన్ని చదును చేసి ట్రాన్స్కోకు అప్పగించాం. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విడిభాగాలు రాగా పనులు జరుగుతున్నాయి.
– కృష్ణమోహన్, ఈఈ
ఉదండాపూర్ రిజర్వాయర్తో జడ్చర్ల ప్రాంతం పచ్చబడుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందుతుంది. అదేవిధంగా భూగర్భజలాలు కూడా పెరుగుతాయి. ప్రాజెక్టు నిర్మాణంతో సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన రిజర్వాయర్తో రైతులకు ఎంతో లాభం చేకూరనున్నది. వ్యవసాయం ఆధారడిపడి జీవిస్తున్న ఎంతోమందికి ఉపాధి లభించనున్నది.
– ఇంతియాజ్ఖాన్, ముడా డైరక్టర్, జడ్చర్ల
సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జడ్చర్ల ప్రాంతంలో ఎన్నిబోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. దీంతో నానా కష్టాలు పడుతున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతానికి పుష్కలంగా నీళ్లు వచ్చి బీడుభూములన్నీ సాగులోకి వస్తాయి. దీంతో వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు విరివిగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. ఇక్కడి రైతుల కష్టాలను చూసి ప్రాజెక్టులను నిర్మించడం ఎంతో ఆనందంగా ఉంది. ఉదండాపూర్ రిజర్వాయర్కు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మా కృతజ్ఞతలు.
– నాగిరెడ్డి, కోడ్గల్, జడ్చర్ల మండలం