మహబూబ్నగర్, జూన్ 6 : పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ శిల్పారామంలో దశాబ్ది వేడుకల్లో భాగంగా పరిశ్రమలశాఖ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల పాలమూరు బిడ్డలకు ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 10వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మన ప్రాంతంలోనే లభించడంతో ఎంతో గొప్ప విషయమన్నారు. గిట్టని వారు కొందరు పరిశ్రమల వల్ల ఎలాంటి లాభం లేదని మాట్లాడుతున్నారని, కంపెనీలు పూర్తిస్థాయిలో ప్రారంభమై ఉద్యోగాలు పొందితే వాటి విలువ తెలుస్తుందన్నారు. స్వీయ ధ్రువీకరణ విధానచట్టం 2014 ప్రకారం టీఎస్ ఐపాస్ యాక్ట్ అనుమతులు నిర్దేశిత కాల పరిమితితో మంజూరు చేశామన్నారు. 414 మంది పారిశ్రామికవేత్తల నుంచి రూ.9912.89కోట్ల పెట్టుబడులతో 28,207 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వివిధ శాఖలకు 1,606 అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 1,247 అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. షెడ్యూల్డ్ కులాల వారికి సంబంధించి 704 దరఖాస్తులకు రూ.3కోట్ల 17లక్షల 8,930 రాయితీ, షెడ్యూల్డ్ తెగలకు వారికి చెందిన 1,587 దరఖాస్తులకు చెందిన రూ.84కోట్ల 48లక్షల 95,105 రాయితీ, దివ్యాంగులు 58 మందికి రూ.2కోట్ల 70లక్షల 46,417 రాయితీని వాహన, ఇతర యూనిట్లకు పెట్టుబడి కోసం టీ-ఫ్రైడ్ పాలసీ ద్వారా మంజూరు చేసినట్లు వివరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పరిశ్రమలను ముందుకు సాగించేందు కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం పట్టువస్ర్తాలు, తదితర స్టాల్స్ను మంత్రి ప రిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవినాయక్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొన్నారు.