నాగర్కర్నూల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) :గులాబీ దళమంటే సీఎం కేసీఆర్కు ఎంతో అ‘భీమా’నం. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు.. అందుకే పార్టీశ్రేణులకు ఇన్సూరెన్స్ రూపంలో భ రోసా కల్పిస్తున్నారు. పార్టీకి వెన్నంటే ఉండే కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయిన నేతకు రూ.2 లక్షల బీమాను అందిస్తూ వారి కు టుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపుతున్నారు. ఎ లాంటి పైరవీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుం డా హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచే నేరుగా ఇన్సూరెన్స్ చెక్కులు జారీ అవుతున్నాయి. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు స్వయంగా మృతి చెంది న కుటుంబాల ఇండ్ల వద్దకు వెళ్లి మరీ అందజేస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలో నమ్మకాన్ని పెంచుతుంది. సభ్యత్వాలకు భారీ స్పందన వస్తున్నది. గులాబీ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ బీమా ధైర్యంగా నిలుస్తున్నది. ఈ సొమ్ముతో ఆర్థిక కష్టాలు తీరాయని కొందరు.. మా అప్పులు తీర్చుకున్నామని ఇంకొందరు.. మా ఆడబిడ్డల పెండ్లిండ్లు చేశామని మరికొందరు సంతోషంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
కార్యకర్తలకు సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అమలు చేస్తున్న బీమా పథకం కార్యకర్తల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉద్యమంలో భాగమవుతూ స్వరాష్ట్ర సాధన, ఆ తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ పార్టీకి కార్యకర్తలు వెన్నంటి నిలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ బీమా పథకాన్ని తీసుకొచ్చారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి నాయకుడు, కార్యకర్తకి ఈ బీమా ద్వారా రూ.2లక్షల ఆర్థిక సాయం అందుతుంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నాయకుడికి పదవులు కట్టబెట్టేందుకే కార్యకర్తలను వాడుకుంటున్న పార్టీలకు విరుద్ధంగా బీఆర్ఎస్ నిలుస్తున్నది. ఈ పథకంలో భాగంగా మృతి చెంది న కార్యకర్తల కుటుంబాలకు ఎలాంటి పైరవీలు, మధ్య వర్తులకు తావు లేకుండా ప్రగతి భవన్ నుంచే నేరుగా చెక్లు జారీ అవుతున్నాయి.
ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు స్వయంగా మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలు, ఇండ్లకు వెళ్లి మరి అందజేస్తున్నారు. గతంలోని పార్టీలకు భిన్నంగా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ చూపిస్తున్న అభిమానం ఆయా కుటుంబాల్లో నమ్మకాన్ని పెంచుతున్నది. దీని వల్ల పార్టీ సభ్యత్వాలకు ఇతర పార్టీలకు మించిన స్పందన లభిస్తున్నది. యువకులతో పాటుగా మహిళలు సైతం బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకు నేందుకు పోటీ పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని వల్ల సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యానికంటే అధికంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాలు నమోదు కావడం విశేషం. ఒక్కో నియోజకవర్గానికి రూ.50వేల సభ్యత్వాలను గతంలో లక్ష్యంగా ఉంటే ఆయా నియోజకవర్గాలో 70వేలకు పైగా సభ్యత్వాలు దాటిన పరిస్థితులు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలతోపాటుగా సభ్య త్వం తీసుకున్న కుటుంబాలకు బీమా రూపంలో అందుతున్న సాయం ప్రజల్లో పార్టీ సానుభూతి పరుల్లో నమ్మకాన్ని పెంచింది. ఇలా పార్టీ సభ్యత్వం తీసుకున్న వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఇటీవల కాలంలో మృతి చెందగా రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో సహా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బీమా చెక్కులను కార్యకర్తల కుటుంబాల కు అందజేసి భరోసా కల్పించారు.
ఈ సాయం పొందిన కార్యకర్తల కుటుంబాలు అప్పులే తీర్చుకోవడంతోపాటు కిరాణం, చికెన్ సెంటర్ లాంటి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. రూ.10 సభ్యత్వం కట్టిన కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల బీమా కల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేనున్నాననే భరోసాను ఇవ్వడం రాజకీయ పార్టీల చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
కార్యకర్తలు పార్టీ కుటుంబ సభ్యులు
పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలు. కార్యకర్తల వల్లే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి కుటుంబ సభ్యులు. వారికి ఏ చిన్న ఆపద కలిగినా వారిని అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తున మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున వారి ఇంటికి వెళ్లి అందజేస్తున్నాం. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం.
– ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, నాగర్కర్నూల్
జీవితాంతం రుణపడి ఉంటాం..
నా భర్త పెబ్బేటి మద్దిలేటి బీఆర్ఎస్ల చేరి ఎప్పుడూ పార్టీ మీటింగులకు పోతుండే. 2021 ఆగస్టు 23న మా ఊరికి సమీపంలో ఆగ్రహారం రోడ్డు మలుపు వద్ద ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదలో మృతి చెందా డు. మాకు కూతురు, ఇద్దరు కొడులు ఉండడంతో వారిని ఎలా చదివించాలి, ఎలా సాదుకోవాలని బాధపడు తుండగా మద్దిలేటికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉందని, పార్టీ తరఫున రూ.2లక్షలు వస్తాయని మా ఊళ్లో నాయకులు చెప్పిం డ్రు. దీంతో నాకు ధైర్యమొచ్చింది. ఏడాది తిరగక ముందే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మా ఇంటికి వచ్చి బీమా చెక్కును నాకు అందించిండు. ఆ చెక్కును మా ఊళ్లోని నాయకులు నా ముగ్గురు పిల్లల పేర్ల మీద కొల్లాపూర్ బ్యాంకులో డిపాజిట్ జేసిండ్రు. సర్పంచ్, ఉపసర్పంచులు నాకు వితంతు పింఛన్ మంజూరు చేయడంతోపాటు ఎమ్మెల్యే సారు రామాపురం దవాఖానలో స్వీపరుగా పని ఇప్పించాడు. కన్నవాళ్లు కనికరించకపోయినా కష్టకాలంలో కొండంత అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేకు జీవితాంతం రుణపడి ఉంటాం. – సుజాత, మాచినేనిపల్లి, కొల్లాపూర్
ఇన్సూరెన్స్తో కూతురు పెండ్లి చేశా..
నాభర్త శేఖర్ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉండేవాడు. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంతో మృతి చెందాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున రూ.2లక్షలు వచ్చాయి. ఆ డబ్బులతో మాబిడ్డ పెళ్లి చేశా. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు ఇన్సూరెన్సు చేయించడం వల్లనే రూ.2లక్షలు వచ్చాయి. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. పార్టీ సభ్యత్వంకు ఇన్సూరెన్సు లేకుంటే మేము ఎలా బతికే వాళ్లమని, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినందుకే కూతురు పెళ్లి చేసాను. – సువర్ణ, ఖానాపూర్, జడ్చర్ల మండలం
బీమా డబ్బుతో అప్పులు కట్టుకున్నాం..
ఇప్పటి వరకు కార్యకర్తలకు అండగా నిలిచిన ఏ ప్రభుత్వాన్ని మేము చూడలేదు. కార్యకర్త కుటుంబం మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకూడదనే ఆలోచనతో సీఎం కేసీఆర్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయ డం సంతోషంగా ఉంది. ప్రభుత్వాలు అన్ని కార్యకర్తలతో ఓటు వేయించుకుంటారే తప్పా వారికి ఎటువంటి భరోసా ఇవ్వరు. బీఆర్ఎస్లో కార్యకర్తగా పని చేస్తూ సభ్యత్వం తీసుకున్నందుకు మా కుటుంబానికి రూ.2లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది. నా భర్త యువరాజు రోడ్డు ప్రమాదంలో మరణించగా ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాకు ఇన్సూరెన్స్ రావడానికి సహకరించాడు. మాకు అప్పులు ఉన్నాయి. వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుతో నా భర్త చేసిన అప్పులు తీర్చుకున్నా మాకు ఎకరా పొలం ఉంది. ఆ పొలం చేసుకుంటూ కూలి పనులకు వెళ్లే వాళ్లం. నా భర్తకు బీఆర్ఎస్ పార్టీ అన్నా కేసీఆర్ అన్నా చాలా ఇష్టం. ఇన్సూరెన్స్ డబ్బులతోపాటు రైతు బీమా నుంచి రూ.ఐదు లక్షలు మాకు అందించారు. దీం తో అప్పులు తీర్చుకొని ఉన్నదాంట్లో తృప్తిగా బతుకుతున్నాం. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో లేకుంటే ఈ పథకాలు మాకు వచ్చేవి కావు. మేము బతికి ఉన్నతకాలం బీఆర్ఎస్కు అండగా ఉంటాం. మాకు పార్టీ ఇన్సూరెన్స్, రైతు బీమా అందించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బండ్లకు మా కుటుంబం రుణపడి ఉంటుంది.
– భారతమ్మ, పూడూరు, గద్వాల మండలం
నా బిడ్డ ఆపరేషన్కు ఉపయోగపడ్డాయి..
మాది జడ్చర్ల మండలం చర్లపల్లి, నా భర్త చెన్నకేశవులుగౌడ్ జడ్చర్ల మండలంలోని మల్లెబోయిన్పల్లిలో విద్యుత్షాక్తో మృతి చెందాడు. నా భర్తకు పార్టీ సభ్య త్వం ఉండడంతో పార్టీ నుంచి ఇన్సూరెన్సు డబ్బులు రూ.2లక్షలు అందించారు. అదేవిధంగా రైతుబీమా నుంచి కూడా రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి రావడంతో నా బిడ్డ బ్రెయిన్ ఆపరేషన్ కోసం అవి ఉపయోగపడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యకర్తలను ఆదుకోవడం కోసం పార్టీ తరఫున ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టడం చాలా బాగుంది. ఏ పార్టీ వారు కూడా ఇలా చేయడం లేదు. ఏది ఏమైనా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-శశికళ, చర్లపల్లి, జడ్చర్ల మండలం
కుటుంబానికి బీమాతో భరోసా..
మాది సాధారణ కుటుంబం, పని చేసుకుంటే గాని పూట గడవదు, బీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో మా కుటుంబంలో అందరం స్థానిక మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ సుష్మా ప్రోత్సహంతో పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. అనుకోకుండా నా భర్త మద్దిలేటి 2022 మేలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ రూ.2లక్షల బీమా ఇచ్చి ఆదుకున్నది. దీంతో కుట్టుమిషన్తో జీవనం సాగిస్తున్నా. ఏ పార్టీ కూడా కార్యకర్తలను నాయకులు ఈ విధంగా ఆదుకోరు. పార్టీ అంటే అధికారంలో ఉం డే నాయకులకే కాకుండా సాధారణ కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా ఉండటం సంతోషంగా ఉంది.
-సునీత, అలంపూర్
ఇన్సూరెన్స్ పైసలే ఆదుకున్నాయి..
కొత్తకోట బైపాస్ రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి కొ ట్టింది. సెప్టెంబర్ 7, 2020న నామొగుడు బాలయ్య (58) ప్రా ణం ఆడనే పోయింది. నాకు కాలు విరిగింది. కొ న్ని దినాలు అట్లనే దవాఖానకు తిరిగినం బాగ అయితద న్నారు డాక్టర్లు. ఆర్నెళ్ల పొద్దుకి కాలు మొత్తం చెడిపోయిందని తీస్సెయ్యాలన్నారు. ఆ టైమ్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్లు, ఎమ్మెల్యే ఇన్సూరెన్స్ పైసలు ఇచ్చిండ్రు. ఆ పైసలతోటి కాలు తీయించినం. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి పా ర్టీ అందించిన బీమా డబ్బు రూ. 2 లక్షలు వారిని ఆదుకున్నాయి. కరోనా సమయంలో వైద్య ఖర్చులు, కూతురు వి వాహం, ఇంటి నిర్మాణానికి దోహదపడింది. పార్టీల తిరిగినోళ్లకి ఏమన్న అయితే ఇట్ల కూడా పైసలియ్యడం మంచిపని. నా మొగుడు ఇప్పటి వరకు ఎల్ఐసీ కూడా కట్టిలేడు. పార్టీ జెండా మోసినందుకు కేసీఆర్ సారు ఇన్సూరెన్స్ ఇప్పించిండు. పార్టీల తిరిగినోళ్లందరికీ పార్టీ తరఫున బీమా ఇయ్యడం చాలా మంచిది. ఇయ్యాల, రేపట్ల ఎవ్వరికేం అయితదో సెప్పనింకె రాదు. అందరి బాగు కోరే కేసీఆర్ సారు ముందుచూపుతోటి ఇది కట్టియ్యడం మంచిగయ్యింది. లేకపోతే కరోనా టైమ్లో షానా తిప్పలు పడేటోళ్లం. ఆ పైసలొచ్చినందుకు ఇప్పుడు నాలుగు మెతుకులు తింటున్నం. లేకుంటే నేను కూడా నా మొగునొద్దకే పోతుంటి. పార్టీ వాళ్లు చొరవ తీసుకొని ఎమ్మెల్యే చిట్టెం సార్ సహకారంతో బీమా డబ్బులు వచ్చేలా చేసిండ్రు. మా ఆయనొక్కడే పార్టీల తిరిగినందుకు ఆయనకే ఇన్సూరెన్స్ వచ్చింది. నేను కూడా ఉన్నింటే నా కాలు ఖర్చులు కూడా వచ్చేవని మా సర్పంచయ్య చెప్పిండు. ఈ ఏడు నా కొడుకు, కోడలు కూడా పార్టీల సభ్యత్వం తీసుకుంటాం. నాకు ప్లాస్టిక్ కాలు పెట్టించింటె బాగుండె. పైసలు లేని టైమ్ల పార్టీ వాళ్లు ఇచ్చిన పైసలే మమ్మల్ని ఆదుకున్నాయి.
– కుమ్మరి బాలమ్మ, రేచింతల, ఆత్మకూరు మండలం, వనపర్తి జిల్లా