పాలమూరు, ఫిబ్రవరి 19 : దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహరాజు అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ రోడ్డులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ శివాజీ మహరాజ్ భారతదేశం గర్వించే దిశగా ప్రజా సంక్షేమాన్ని అమలు చేశారని, హైందవ సంస్కృతిని కాపాడారని కొనియాడారు. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, జ్యోతిబాఫూలే, స్వామి వివేకానంద, పండుగ సాయన్న వంటి వారు దేశం , ప్రజల కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. ఇలాంటి మహనీయుల విగ్రహాలను చూసి వారిని స్మరించుకోవడంతోపాటు వారి ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు.
దేశం కోసం, సమాజంలో మార్పుకు తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల గురించి భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకొండ యువత ముందుకు వస్తే బైపాస్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించానని, వెంటనే వారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్లు గణేశ్, నరేందర్, కట్టా రవికిషన్రెడ్డి, వేదావత్, శ్రీనివాసులు, కిశోర్కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకు లు కృష్ణమోహన్, శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, సతీశ్, రవికుమార్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.