జడ్చర/జడ్చర్లటౌన్, జూన్ 8 : జడ్చర్ల ఎర్రగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డితో పాటు కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, కార్పొరేషన్ చైర్మన్లతో కలసి పండుగ వాతావరణంలో 560 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. మొదటగా ఐదుగురు లబ్ధిదారుల ఇండ్లకు పూజలు చేసి మంత్రి కేటీఆర్ సమక్షంలో గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ లబ్ధిదారులతో మాట్లాడారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పొందటం ఆనందంగా ఉన్నదా.. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇది వరకు ఎక్కడ ఉండేవారని? కిరాయి ఇండ్లల్లో ఎంత కిరాయి ఇచ్చేవారని? అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇల్లు లేక ఇబ్బంది పడేవారమని డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిన మీ కోసం భగవంతుడిని ప్రార్థిస్తామని పలువురు పేర్కొన్నారు.
జడ్చర్లకు విచ్చేసిన మంత్రి కేటీఆర్కు ఘనస్వాగతం లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు పట్టణ రహదారుల పొడవునా స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లన్నీ గులాబీమయంగా మారాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. బహిరంగ సభలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి ప్రసంగిస్తూ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడంతో శ్రేణులంతా కేరింతలు కొట్టారు. ఎమ్మెల్యే లక్ష్మన్న అంటూ పలువురు నినదించారు.
భూత్పూర్, జూన్ 8 : మున్సిపాలిటీలను అందంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. భూత్పూర్లో ఏర్పాటుచేసిన మున్సిపల్ పార్కు, ఓపెన్ జిమ్, మున్సిపాలిటీ స్వాగత బోర్డును మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ అయిప్పటికీ.. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులకు ఎంపిక కావడం గొప్ప విషయమని.. అందుకు కారణమైన ఎమ్మెల్యే ఆల, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, కమిషనర్ నూరుల్ నజీబ్, సిబ్బందిని అభినందించారు. నిరంతరం అభివృద్ధికి కృషి చేయాలని.. అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల, లక్ష్మారెడ్డి, గువ్వల, కలెక్టర్ రవినాయక్, ఎంపీపీ శేఖర్రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, కృష్ణవేణి, నాగమ్మ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.