మహబూబ్నగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు యాసంగిలో రికార్డుస్థాయిలో వరి సాగు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో గతేడాదికంటే నాలుగింతలు యాసంగిలో సాగు చేయడం ఇదే మొదటిసారి. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి పథకాలపై దృష్టి సారించడంతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో యాసంగిలో వరి జోరు కొనసాగుతున్నది. వ్యవసాయశాఖ అధికారుల అంచనాలను తలకిందులు చే స్తూ రైతులు అధిక విస్తీర్ణంలో వరి నాట్లు వేశారు. గతేడాది లక్ష ఎకరాల లోపే వరి సాగు చేయగా ఈ ఏడాది 5లక్షల ఎకరాలకు చేరువ కావడం గమనార్హం. బోర్లు, చెరువులు, ప్రాజెక్టుల కింద వేలాది ఎకరాల్లో వరిసాగు పెరిగిందని అధికాలు చెబుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తయితే తెలంగాణవ్యాప్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారుల అంచనా. ఈ ఏడాది పుష్కలంగా కురిసిన వానలతో ప్రాజెక్టులకు శోభ చేకూరించి.
జూరాల ప్రాజెక్టుకు ఈసారి కూడా వరద పెరగడం, వందల టీఎంసీలు ఇక్కడి నుంచి వదిలినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈసారి ఎండాకాలం వచ్చినా చెరువుల్లో నీళ్లు ఉండడం అన్నదాతలకు మరింత ఉరటనిస్తున్నది. ఇటీవల వనపర్తి జిల్లాలో బ్రాంచ్ కెనాల్ ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో అడ్డాకుల చెరువుకు సైతం నీళ్లు చేరాయి. మిషన్ కాకతీయ కింద చెరువులన్నింటినీ పునరుద్ధరించడంతో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. ఫలితంగా భూగర్బ జలాలు పెరిగి బోర్లలో నీరు అందుతున్నది. కొన్నిచోట్ల మోటర్ అవసరం లేకుండానే నీళ్లు బయటకు వచ్చిన సంఘటనలు అధికారులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. సొంత ఇలాఖాలో ఈసారి యాసంగి సాగు పెరగడంతో రైతులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజను డు అభినందనలు తెలుపుతున్నారు. ప్రభు త్వం సాగునీటి పథకాలపై దూరదృష్టితో వ్య వహరిస్తున్నందుకే యాసంగిలో వరి సాగు పె రిగిందని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
4,77,889 ఎకరాల్లో..
యాసంగిలో అన్నదాతలు రికార్డుస్థాయిలో వరి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కల్లో తేలింది. గతేడాదితో పోల్చుకుంటే నాలుగింతల సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది యాసంగిలో ఉమ్మడిజిల్లాలో కేవలం 98,826 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. ఈ ఏడాది ఏకంగా 4, 77,889 ఎకరాల్లో సాగు చేస్తుండటం గమనార్హం. గతేడాది కంటే దాదాపు 3.79లక్షల ఎకరాల్లో సాగు పెరగడా న్ని అధికారులు రికార్డుగా పరిగణిస్తున్నారు. వనపర్తి జిల్లా లో గతేడాది కేవలం 12 వేల ఎకరాల్లో సా గు విస్తీర్ణం ఉం డగా ఈ ఏడాది అత్యధికంగా 1,26,566 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో గతంలో 12.8 వేల ఎకరాలు కాగా ఈసారి ఏకంగా 1,06,477 ఎకరాలకు చేరింది. నారాయణపేట జిల్లాలో గతేడాది 17వేల ఎకరాల్లో సాగు చేయగా ప్రస్తుతం 97వేల ఎకరాలకు పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం గతంతో పోల్చి తే రెండింతలు ఎక్కువగా 94వేల ఎకరాల్లో సాగు చేస్తున్న ట్లు అధికారులు చెబుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా లో గతేడాది 24వేల ఎకరాలైతే ఈ ఏడాది 53వేల ఎకరాల్లో వరి సాగవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
నిండుకుండల్లా ప్రాజెక్టులు..
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురిశాయి. వానకాలం ప్రారంభంలో అంతంత మాత్రంగానే ఉన్నా ఆ తర్వత విపరీతంగా వర్షాలు కురిశాయి. దీంతో కృష్ణ, తుంగభద్ర నదులతోపాటు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఎన్నో చెరువులు అలుగు పారాయి. జూరాల, కోయిల్సాగర్, రామన్పాడు, సరళాసాగర్ ప్రాజెక్టులు అనేకసార్లు నిండడంతో అధికారులు దిగువకు నీటిని వదిలారు. దుందుభీ వాగు కూడా రికార్డుస్థాయిలో ప్రవహించింది. జూరాల కుడి, ఎడమ కాల్వల్లో నిరంతరాయంగా నీళ్లు పారగా.. కోయిల్సాగర్ ప్రాజెక్టు కూడా ఎగువన కురిసిన వర్షాలకే నిండింది. చెరువులు నిండడంతో భూగర్భజలాలు పెరిగాయి. చిన్నచింతకుంట, కొల్లాపూర్ ప్రాంతాల్లో బోర్ల నుంచి ఊట వచ్చింది. కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కారణంగా ఈ ఏడాది తాగునీటికి ఢోకా ఉండబోదని అధికారులు అంచనా వేస్తున్నారు.
యాసంగిలో పెరిగింది
జిల్లాలో గతంలో కన్న యాసంగిలో వరిసాగు మరింత పెరిగింది. మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పెరగడంతో రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. జిల్లాలోని చెరువులు, కుంటలతోపాటు చెక్డ్యాంలలో నీరు పుష్కలంగా ఉండడంతో చుట్టూ ఉన్న బోర్లల్లో నీటి ఊట పెరిగింది. ఫలితంగా యాసంగిలో వరి నాట్లు ఎక్కువగా వేశారు. యాసంగి సాగు వానకాలం సాగును తలపిస్తున్నది.
– సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఫలితాన్నిస్తున్న పథకాలు
తెలంగాణ వచ్చాక సాగునీటి రంగంపై సీఎం కేసీఆర్ ఉంచిన దూరదృష్టి ప్రస్తుతం ఫలితాలనుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఎన్నో గోసలు పడ్డాం. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ సాగునీటి పథకాలన్నింటికీ నిధులిచ్చి పూర్తి చేయగా నేడు ఎక్కడ చూసినా నీరు కనిపిస్తూ కనువిందు చేస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో యాసంగిలో రికార్డుస్థాయిలో వరి పండించమే ఇందుకు నిదర్శనం. రైతులు వరితోపాటు ఇతర పంటలపై కూడా దృష్టి సారించాలి. లాభాలు వచ్చే పంటలను పండిస్తే రైతులతోపాటు జిల్లా స్వరూపమే మారిపోతుంది.
– సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి