కందనూలులో కృష్ణమ్మ జలసవ్వడి యాసంగిని సంబురంగా చేసింది. జిల్లాలో కరువును పూర్తిగా తరిమివేసింది. నాగర్కర్నూల్ జిల్లాలో జలసంబురం నెలకొన్నది. చెరువులు, కాల్వల్లో ఎంజీకేఎల్ఐ జలాలు నిండుగా పారుతున్నాయి. ఎండాకాలంలోనూ వానకాలాన్ని తలపిస్తున్నది. దీంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమవగా.. భూగర్భ జలాల పెరుగుదలతో ప్రజలకు తాగునీటి ఢోకా తీరింది. పదేండ్లతో పోలిస్తే 7 మీటర్ల మేర నీటి లభ్యత పెరిగింది. 2012లో జిల్లాలో సరాసరి 13.66 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉండగా.. నేడు 6.45 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నది. కోడేరు మండలం తుర్కదిన్నెలో కేవలం 4.42 మీటర్ల లోతులోనే నీరు లభించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగా ణ) : కందనూలులో జలసవ్వడి నెలకొన్నది. ఎం డాకాలం వస్తున్నా.. వానకాలాన్ని తలపించేలా కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంజీకెల్ఐ ప్రా జెక్ట్ పూర్తవ్వడంతో జిల్లా ముఖచిత్రం మారిపోయింది. వ్యవసాయ విస్తీర్ణం గణనీయంగా పెరిగిం ది. వ్యవసాయ ఉత్పాదక రంగాల్లోనూ, రియల్ వ్యాపారంలోనూ దినదిన ప్రవర్థమానంగా మారుతున్నది. ఫలితంగా ఏటా వానకాలం, యాసంగిలో పంటల సాగు, దిగుబడి పెరుగుతున్నది. ఈ సారి కూడా కృష్ణా జలాలతో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. మార్చి చివరి నాటికి యాసంగి సాగుకు నీటిని విడుదల చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీ సుకున్నారు. ఫలితంగా ఎంజీకేఎల్ఐ పరిధిలోని చెరువులు, వాగులు నీటి సవ్వడితో పరుగులు పె డుతున్నాయి. ముఖ్యంగా సిర్సవాడ, మేడిపూర్, పొల్మూర్, గుట్టలపల్లి, రఘుపతిపేట, ఉల్పర, దా సర్లపల్లి గ్రామాల మీదుగా ప్రవహించే దుందుభీ నదిలో నీటి ప్రవాహం కొనసాగుతున్నది.
నాగర్కర్నూల్-కల్వకుర్తి ప్రధాన రహదారి మధ్య ప్రవహించే ఈ నది గతంలో ఎప్పుడూ ఎండిపోయిన ఇసుక, ముళ్ల కంపలతో కనిపించేది. ఇప్పుడు నీరు ప్రవహిస్తున్నది. ఫలితంగా జిల్లాలో ఈ సీజన్లో వ్యవసాయం సైతం ఆశాజనకంగా సాగుతున్నది. వరి, వేరుశనగ, మొక్కజొన్న, కందులు, జొన్న వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇదిలా ఉం డగా, జిల్లాలో భూగర్భ జలాలు సైతం పెరిగాయి. కురిసే వానలకన్నా ఎంజీకేఎల్ఐ నీళ్లే భూగర్భ జలమట్టాల పెరుగుదలకుప్రధాన కారణంగా నిలుస్తుండడం గమనార్హం.
పదేండ్లతో పోలిస్తే దాదాపుగా 7 మీటర్లు మేర నీటి లభ్యత పెరగడం విశేషం. 2012లో జిల్లాలో సరాసరి 13.66 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉండగా.. ఇప్పుడు 6.45 మీటర్ల లోతులోనే నమోదవుతున్నది. కోడేరు మండలం తుర్కదిన్నెలో 4.42 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉండడం మారిన ప్రభుత్వ తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. దీన్నిబట్టి చూస్తే కందనూలులో ఎం జీకేఎల్ఐ ప్రాజెక్ట్ ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తున్నది. ప్రాజెక్ట్ పరిధి కింద జిల్లాలో దాదాపుగా 35 వేల ఎకరాల్లో పంటల సాగవుతున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ సీజన్లో 2.99 లక్షల ఎకరాలకు గానూ 2 లక్షల ఎకరాల వరకు సాగు చేపట్టారు. 2020 యాసంగిలో 3 లక్షల ఎకరాల సాగు జరిగితే, 2021-22లో 2.54 లక్షల ఎకరాల్లో సాగైంది. దీనంతటికీ చెరువులు, కుంటలు, కాల్వల్లో నిండుగా పారుతున్న ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా పారుతున్న కృష్ణా జ లాలతోనే అన్నది స్పష్టం. దీంతో ఎండాకాలం ఆరంభంలోనూ జిల్లాలో వానకాలాన్ని తలపించే లా నీళ్లు పారుతుండడం రైతులు, ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నది.
ఎంజీకేఎల్ఐ ప్రాజెక్ట్ పుణ్యమా అని కృష్ణా జలాలు నిరంతరం పారుతున్నాయి. జిల్లాలోని 114 చెరువులు అలుగు పారుతున్నాయి. 75 నుంచి 100 శాతం వరకు 938 చెరువులు నీటితో ఉన్నాయి. వానకాలం మాదిరిగానే చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలూ పెరిగాయి. ఫలితంగా సాగు, తాగునీటికి సమస్య తీరింది.
– రమేశ్, డీఈ, నీటిపారుదల శాఖ, నాగర్కర్నూల్