వారం రోజులుగా చలితో ప్రజలు గజగజా వణుకుతున్నారు. దీనికి తోడు తుఫాన్ల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తెల్లవారుజామునుంచి మంచుకుతోడు చలిగాలులు వీచడంతో మధ్యాహ్నం వరకు కూడా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. సాయంత్రం 4 గంటలు దాటిందంటే చాలు చలితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఉదయాన్నే విద్యాలయాలు, ఉద్యోగాలు, వివిధ పనులకు వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తమా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు చలిప్రభావానికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితులతో అనారోగ్యాల పాలవుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 13 : మారుతున్న వాతావరణానికి తోడు చలికాలం గజగజా వణికిస్తోంది. తెల్లవారుజామున జనం బయటికి రావాలంటే జంకుతున్నారు. గత పది రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. మిట్ట మధ్యాహ్నం కూడా చలి తీవ్రత ఉండడంతో ధీర్ఘకాలిక రోగులకు ఇబ్బందిగా మారింది. దీనికితోడు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ప్లూ, జ్వరం, ఆయాసం కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా, సీవోపీడీ, ఆలర్జీ, బ్రంకైటిస్, నిమోనియా తదితర శ్వాసకోశ వ్యాధులవారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
శీతల వాతావరణం కారణంగా పలువురు అలర్జీ ఎక్కువగా ఉన్న వారు బ్రాంకైటిస్ బారినపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ శక్తివంతమవుతుందనీ వైద్యులు అంటున్నారు. దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఐదారు రోజుల్లో తగ్గే జబ్బు, అలర్జీ ప్రస్తుతం రెండువారాలు ఉంటోందని, పలు జగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
చల్లటి గాలులకు చర్మం పొడిబారుతున్నది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతోంది. అరికాళ్లు పగిలి ఇబ్బంది పడుతున్నారు. శరీరంలో తేమశాతం తగ్గిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. దురదలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ తరహా సమస్యలు మధుమేహం రోగులకు వస్తే ఇబ్బందులు ఉంటాయని, త్వరగా నయంకాకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ పెగరుతోందని వైద్యులు అంటున్నారు.
ఆస్తమా, నిమోనియా, సివోపీడీ, గుండె వ్యాధులతో బాధపడేవారికి చలికాలం కష్టకాలమని వైద్యులు పేర్కొంటారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్నా అస్తమా పెరుగుతుందన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదముంది. వైద్యం ఆలస్యమైతే క్రమేణా ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని పొరలు ఉబ్బిపోయి శ్వాస కష్టంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
శ్వాసకోశ, ఈఎన్టీ సమస్యలున్న వారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. నీటిని కాచి, చల్లార్చి వడపోసుకుని తాగాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. శరీరం పూర్తిగా కప్పి ఉం డేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పానీయాలు, ఐస్క్రీమ్ తినవద్దు. ఫ్రిజ్ నీళ్లు అసలు తాగవద్దు. వేడి ఆహారమే తీసుకోవాలి.