కొల్లాపూర్ మామిడిపై దళారులు గద్దల్లా వాలారు. ఇక్కడ పండే పండ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. డిమాండ్ను గుర్తించిన వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకున్నారు. రైతుల నుంచి తక్కువ ధరలకు పోటాపోటీగా కొనుగోళ్లు చేసి ఢిల్లీ, ముంబయి, ఇతర పట్టణాలకు ఎగుమతి చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో మద్దతు ధర అందక రైతులు దగా పడుతుండగా.. దళారులు మాత్రం రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. కాగా ఈ ఏడాది పండ్ల దిగుబడి తగ్గింది. ప్రస్తుతం టన్ను ధర రూ.33 వేలు ఉండగా.. గతేడాదితో పోల్చితే సగం ధర తక్కువగా పలుకుతున్నది.
కొల్లాపూర్, మే 18 : కొల్లాపూర్ మామిడి.. రుచి, తీపి, నాణ్యతలోనూ జాతీయ మార్కెట్లో పేరు ప్ర ఖ్యాతలు గాంచింది. ఈ ఏడాది మామిడి దిగుబడి పూర్తిగా తగ్గినప్పటికీ కొన్ని రోజులుగా కొల్లాపూర్ పట్టణం నుంచి ఢిల్లీ, పెద్దకొత్తపల్లి నుంచి ముంబయికి మామిడి రకాలు ఎగుమతులవుతున్నాయి. ఆయా నగరాల నుంచి ఇక్కడికి మామిడి కొనుగోలు కోసం నెలరోజుల ముందే దళారులు గద్దల్లా వాలారు. ముం బై, ఢిల్లీ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు దళారులను రం గంలోకి దించి చౌకగా టన్నుకు రూ.33 వేలు చొప్పు న మామిడి రకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేసి లారీలు, కంటైనర్లలో ఎగుమతులు చేస్తున్నారు. గతేడాది ఈ దళారులు రైతుల తో మాట్లాడుకొని నేరుగా తోటలకు వెళ్లి కాయలను కూలీలతో కోయించి పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్లో అడ్డాలకు తరలించి అక్కడ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ముంబయికి ఎగుమతి చేసేవారు. ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా పడిపోయింది.
వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా పూతదశలోనే రా లిపోయింది. దీంతో కేవలం 60 శాతం మాత్రమే మా మిడి దిగుబడి రావడంతో ఫ్రూట్ మార్కెట్ వ్యాపారు లు పెద్దకొత్తపల్లిలో అద్దె ఇండ్లు, కొల్లాపూర్లో వ్యవసాయ మార్కెట్ యార్డు, ఫంక్షన్హాల్ను అద్దెకు తీసుకొని కొనుగోలు కేంద్రాలుగా మార్చుకున్నారు. మామిడి తోటల రైతులు కాయలను కూలీలతో కోయించి నేరుగా ఆయా కొనుగోలు కేంద్రాలకు వాహనాల్లో త రలిస్తున్నారు. కాయ పరిమాణం తగ్గిందంటూ సా కులు చెప్పి హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్ ధర కంటే తక్కువగా చెల్లిస్తున్నారు. గతేడాది టన్ను మామిడి కాయ ధర రూ.65వేలు ఉంటే.. ప్రస్తుతం రూ.33 వేలు చెల్లించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
గ్రేడింగ్ చేసి బాక్సుల్లో నిల్వ..
కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో అడ్డాల్లో ముంబయి, ఢిల్లీ రాష్ర్టాల నుంచే కూలీలుగా ఇక్కడికి యువకులను రప్పించుకుంటున్నారు. మామిడి కాయల సైజ్లను బట్టి ఏ, బీ గ్రేడ్ చొప్పున ప్లాస్టిక్ బాక్సుల్లో కాయకు కాయ తగిలి దెబ్బతిన్నకుండా మధ్యలో న్యూస్ పేపర్ పెట్టి వరుస క్రమంగా నిల్వచేస్తున్నారు.
34,500 ఎకరాల్లో సాగు..
మామిడితోటల పెంపకానికి తెలంగాణలోని నేలలు అనువైనవిగా ఉద్యానశాఖ నిర్ధారించింది. నాగర్కర్నూల్ జిల్లాలో సుమారు 34,500 ఎకరాల విస్త్తీర్ణం లో మామిడితోటలు సా గులో ఉన్నా యి. అం దులో కొ ల్లాపూర్ నియోజకవర్గంలో 26, 200 ఎకరాల్లో ప్రతి ఏడాది లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి వ స్తుంది. ఈ సారి దిగుబడి పడిపోవడంతో ఉద్యానశాఖ అధికారులు దిగుబడిని అంచనా వేయలేకపోతున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం పండ్ల తోటల సాగుకు రాయితీలు అధికంగా ఇస్తుండడంతో ప్రతి ఏడాది మామిడి సాగు విస్తీర్ణం పెరిగింది. మామిడిలో మేలైన హైబ్రీడ్ రకాలను ఎంచుకొని మొక్కలను పేరుమోసిన నర్సరీల నుంచి తెచ్చి నాటుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఎటు చూసినా పచ్చగా మామిడితోటలు కనిపిస్తాయి. దీంతో కొల్లాపూర్ ప్రాంతం గ్రీన్ బెల్ట్గా మారింది.
దిగుబడి లేక నష్టపోయాం..
నాకు మూడెకరాల్లో మామిడితోట ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో చెట్లకు విపరీతంగా పూత పట్టింది. కానీ, రానురాను తేనే బంకతెగులు తగిలింది. ఎన్ని మందులు కొట్టినా లాభం లేకుండా పోయింది. చెట్టుకు పలుచగా అక్కడక్కడ పట్టిన కాయలతో ఆశించిన దిగుబడిరాక చాలా నష్టపోయాను.
– బొల్గం కిష్టయ్య, మామిడి రైతు, గంట్రావుపల్లి
ఖర్చులు కూడా రావడం లేదు..
నేను ఎకరన్నర మామిడితోటను రూ.50 వేలకు కౌలుకు తీసుకున్నా. దిగుబడి పూర్తిగా పడిపోయి.. పెట్టుబడి కూడా మీదపడింది. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి కాయలతో ఖర్చులు కూడా రావడం లేదు. ఏం చేయా లో పాలుపోవడం లేదు.
– సందు లక్ష్మణస్వామి, కౌలురైతు, పెద్దకొత్తపల్లి
కురుమూర్తి హుండీ లెక్కింపు
దేవరకద్ర రూరల్, మే 18 : చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్తగిరుల్లోని కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తి స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు బుధవారం లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు, పాలక మండలి అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి సమక్షంలో హుండీ డబ్బులు లె క్కించగా.. రూ.3,43,809 వచ్చినట్లు ఈవో తెలిపారు. ఈ డబ్బులను ఆత్మకూర్ బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు శంకర్, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సిబ్బంది శివానందాచారి, శ్రీకర్, అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, వెంకటయ్య, సత్యనారాయణ ఉన్నారు.
మద్దతు ధర లేక బేజారు..
గతేడాది సెర్ప్ ద్వారా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు, తిర్నాంపల్లి, కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి ప్రాంతాల్లోని మామిడి తోటల నుంచే రైతులతో నేరుగా కొనుగోలు చేసి బెంగళూరు ఫ్రూట్ మార్కెట్కు ఎగుమతి చేసేవారు. బెంగళూరు మార్కెట్ ధర ప్రకారంగానే తమకు డబ్బులు చెల్లించేవారని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం సెర్ప్ అధికారులు ముందుకురాలేదని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. అయితే మామిడికి ప్రభుత్వం కనీస మద్దతుధర నిర్ణయించకపోవడంతో.. ఎగుమతుల కష్టాలు భరించలేక స్థానికంగానే అందుబాటులో ఉన్న వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్కు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి తీసుకెళ్తే టాక్స్లపేరుతో దళారులు రైతులను నిలువునా ముంచుతున్నారు. కొనుగోలు చేసిన తరువాత డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో ఉన్న ఢిల్లీ, ముంబయి వ్యాపారులకు అమ్మేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు ధరను పూర్తిగా తగ్గించారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.