l
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం కురిసింది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలపాటు వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. గద్వాలలో జిల్లాలోని లోతట్టు ప్రాతాలన్నీ జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. పంటలు నీటమునిగాయి.
అయిజ, ఆగస్టు 2: అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వానకాలంలో ఎన్నడూ లేనంతగా వాన దంచి కొట్టింది. మంగళవారం ఉదయం 4.20 గంటల నుంచి 6.30 గంటల వరకు పైగా ఏకధాటిగా వాన కురవడంతో మండలంలో పలు గ్రామాల వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. మున్సిపాలిటీ సమీపంలోని పోలోని వాగుకు భారీగా వరద నీరు చేరింది. అయిజ మున్సిపాలిటీలోని లోతట్టు కాలనీలలోకి వర్షం నీరు చేరింది. వర్షం ఏకధాటిగా కురవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. అయిజ నుంచి చిన్న తాండ్రపాడు, పులికల్, ఉత్తనూర్ తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు నీటి మునిగాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చిన్న తాండ్రపాడు, కేశవరం, నౌరోజీక్యాంపు, వేణిసోంపురం, చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ, నసనూర్ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, వాహనాలు చిన్న తాండ్రపాడు రహదారిలో నిలిచిపోయారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్ఐలు లక్ష్మారెడ్డి, మద్దిలేటి పోలోని వాగును పరిశీలించారు. ఎస్సై నరేశ్కుమార్ ఆధ్వర్యంలో రహదారులపై గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద నీరు తగ్గేవరకు ప్రయాణాలను నిలిపి వేశారు. మున్సిపాలిటీలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మడ్డిగుంత కాలనీ, గాజులపేట, భరత్నగర్, దుర్గానగర్ తదితర కాలనీల్లో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. ప్రజాప్రతినిధులు, అధికారులు లోతట్టు కాలనీల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. నీరు నిల్వ ప్రాంతాల్లో నీరు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.
96.6 శాతం వర్షపాతం నమోదు
మల్దకల్, ఆగస్టు 2: మండలంలో మంగళ వారం తెల్లవారుజామున భారీ వర్ష కురిసింది. దీంతో అన్ని గ్రామాల్లో చాలాచోట్ల చిన్నచిన్న కుంటలు నిండుకుండను తలపించాయి. అలాగే మండలంలో 96.6 శాతం మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
పంట పొలాల్లోకి వరద నీరు
గట్టు, ఆగస్టు 2: మండలంలో మంగళవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. తెలవారుజాము నుంచి ప్రారంభమైన వర్షం తెల్లవారిన తర్వాత వరకు కొనసాగింది. గట్టులో 73.4మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ గణాంకాలు సూచించాయి. మండలంలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకల్లో నీరు పెద్ద ఎత్తున ప్రవహించాయి. గట్టు, గొర్లఖాన్దొడ్డి, తప్పెట్లమొర్సు తదితర గ్రామాల్లో పత్తి పైర్లలో మోకాలు లోతు వరకు నీరు నిలిచాయి. దీంతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇదిలావుండగా కుండపోత వర్షం కారణంగా వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఈ సీజన్లో ఇదే పెద్ద వర్షం.
ఉండవెల్లి మండలంలో..
ఉండవెల్లి ఆగస్టు 2 : మండలంలోని పుల్లూరు, కలుగొట్ల, మెన్నిపాడు, బొంకూరు, అలంపూర్ చౌరస్తా, ఉండవెల్లి, బైరాపురం, బస్వపురం, కంచుపాడు, చిన్న ఆముదాలపాడు, తక్కశిల, ప్రాగటూర్, మారమునగాల, శేరుపల్లి, ఇటిక్యాలపాడు గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున 4గంటల నుంచి ఉదయం 6గంటల వరకు వాన దంచికొట్టింది. దీంతో పుల్లూరులో ప్రధాన కాలనీలోకి వరదనీరు ప్రవహించింది. ప్రజలు వరదనీటిలోనే తమ దైనందిన జీవనం కొనసాగించారు. మధ్యాహ్నం తర్వాత వరదనీరు తగ్గుముఖం పట్టడంతో ఆ కాలనీ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
మునిగిన పంటల పరిశీలన
అయిజ రూరల్, ఆగస్ట్టు 2: మంగళవారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్నాయక్, ఏడీఏ సక్రీయానాయక్, ఏవో శంకర్లాల్తో కలిసి మండలంలోని సంకాపురం, ఎక్లాస్పురం, దేవబండ, బింగిదొడ్డి, ఉత్తనూరు తదితర గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రధానంగా పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరితే వెంటనే ఆ నీటిని తొలగించాలని సూచించారు. మొక్కల మొదల వద్ద కాపర్ ఆక్సిక్లోరైడ్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి పోయాలన్నారు. అలాగే 19:19:19ను మొక్కల పైభాగాన పిచికారీ చేయాలని చెప్పారు. తద్వారా పంట మాములు స్థితికి రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు సంబంధిత వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. ఆయన వెంట మండల విస్తరణ అధికారి లోకరాజు, మాజీ సింగిల్విండో అధ్యక్షుడు రాముడు, రైతులు ఉన్నారు.
నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
అలంపూర్, ఆగస్టు 2: మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి అలంపూర్ మున్సిపాలిటీలోని అక్బర్పేట్తోపాటు మరికొన్ని కాలనీలు అతలాకుతలమయ్యాయి. నిరంతరాయంగా కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల్లోని పంటపొలాల నుంచి వర్షపునీరు భారీగా వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయ్యాయి. ఆయా కాలనీల్లో వర్షపు నీరు ఇండ్లల్లోకి చేరింది. వరద నీటి కారణంగా ఇండ్లలోని నిత్యావసర సరుకులు, బట్టలు మరికొన్ని విలువైన సామగ్రికి నష్టం వాటిల్లింది. అప్రమత్తమైన మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్, చైర్పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అలంపూర్లో జరిగిన వరద నస్టాన్ని కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే అబ్రహంకు వివరించారు. వారి ఆదేశాల ప్రకారం ప్రణాళికాబద్ధంగా సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అనంతరం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, పోలీసులతో చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, ఆయా కాలనీల్లో మున్సిపల్ చైర్పర్సన్ పర్యటించి బాధితులను ఓదార్చారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 554.8 మి.మీ వర్షపాతం
అయిజ, ఆగస్టు 2: జిల్లా వ్యాప్తంగా మంగళవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతోపాటు అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలతోపాటు వివిధ మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పారాయి. చెరువుల్లోకి సైతం వరద నీరు చేరుతోంది. జిల్లావ్యాప్తంగా 554.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు సీపీవో లక్ష్మణ్ తెలిపారు. సాధారణ వర్షపాతం 46.2 కాగా, అదనంగా 516.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా మల్దకల్ మండలంలో 91.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా ఇటిక్యాల మండలంలో 12.4 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. మల్దకల్ 91.4, అలంపూర్ 70.7, వడ్డేపల్లి 67.4, రాజోళి 67.3, అయిజ 55.8, ధరూర్ 46.7, కేటీదొడ్డి 21.7, గద్వాల 21.3, మానవపాడు 15.4, ఉండవెల్లి 14, ఇటిక్యాల 12.4 మి.మీ వర్షపాతం నమోదైంది.