అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతన్నను కుదేలు చేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలైంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు కురిసింది. అత్యధికంగా పెంట్లవెల్లిలో120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి.. కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న నీటి పాలైంది. గాలులకు మామిడి నేలరాలింది.. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపడ్డాయి.. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి నీరు చేరింది. పిడుగుపాటుతో గాయపడిన వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి.. పలు చోట్ల మూగ జీవాలు చనిపోయాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సుమారు 2 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఎక్కువగా నారాయణపేట జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. నష్టం వివరాలు అంచనా వేసే పనిలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు.
మహబూబ్నగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిసి వానకు కొట్టుకుపోయాయి. చేతికివచ్చిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి చాలాచోట్ల వర్షపు నీళ్లు ఇండ్లలోకి చేరాయి. పిడుగుపాటుకు మూగజీవాలు మృతిచెందాయి. జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో మామిడి కాయలు నేలరాలాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు రెండు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా. అమ్మకానికి వచ్చిన వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. వర్షం ఏకధాటిగా కురవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జోగుళాంబ గద్వాల జిల్లా నందిన్నె గ్రామంలో ఇండ్లలోకి నీళ్లుచేరాయి. వాగులు, కాల్వలు పొంగిపోర్లాయి. ఈదురుగాలులకు పంటచేలల్లో ఉన్న వరి నేలరాలడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారుల అంచనా. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలో 120.2 మిల్లీమీటర్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డిలో 84.3, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల గ్రామంలో 78.3, గద్వాల జిల్లా మల్లాపురంలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలు, కొనుగోలు కేంద్రాలను అధికారులు పరిశీలించారు. ఆయా మండలాల్లో అధికారులు పర్యటించి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు.
అధికారుల అప్రమత్తం..
ఉమ్మడి జిల్లాలో వర్షానికి అతలాకుతలమై జనజీవనం స్తంభించడంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు. కలెక్టర్ల ఆదేశాల మేరకు అధికారులు పంటలు దెబ్బతిన్న రైతుల పొలాలను పరిశీలించి నష్టం అంచనా వేస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అం తరాయం కలిగింది. ట్రాన్స్కో అధికారులు గంటల వ్యవధిలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని అధికారులు అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించారు. గురువారం వరకు పంట నష్టం వివరాలు అందించాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. తీవ్రంగా దెబ్బతిన్న పంటలు, పిడుగులు పడి మృతి చెందిన మూగజీవాల వివరాలను కూడా పొందుపర్చాలని.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలు ప్రత్యేకంగా తీసుకోవాలని సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా సిద్ధంగా ఉండాలని రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు సూచనలిచ్చారు.
నారాయణపేటలో అత్యధికంగా నష్టం..
నారాయణపేట జిల్లాలో అత్యధికంగా 1,028 ఎకరాల్లో వరి, జొన్న ఇతర పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సుమారు 728 మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం వాటిల్లింది. మక్తల్ పట్టణంలో రహదారిపై లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకొని జేసీబీ సాయంతో కాల్వ తవ్వించి నీళ్లను బయటకు పంపించారు. ఊట్కూర్ మండలం బిజ్వార్, దంతన్పల్లి గ్రామాల్లో ఉల్లి పంట దెబ్బతినగా, వరి కంకులు నేలరాలాయి. ఊట్కూర్ మండలకేంద్రంలో కల్లాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది. రెండు చోట్ల పిడుగుపడి ఎద్దులు మృతిచెందాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కేటీదొడ్డి మండలంలో 521 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా.
మహబూబ్నగర్ జిల్లాలో 55 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామంలో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాగర్కర్నూల్ జిల్లా నెల్లికొండ మార్కెట్లో సుమారు ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. తిమ్మాజిపేట మండలం ఆర్సీ తండాలో ధాన్యం కొట్టుకుపోయింది. కల్వకుర్తి మండలం తాండ్రలో వడగండ్లకు వరి పంట దెబ్బతిన్నది.
మరో ఇద్దరికి గాయాలు
కృష్ణ, ఏప్రిల్ 26 : పిడుగుపాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెం దిన ఘటన మండలంలోని మురహరిదొడ్డి గ్రామంలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. మంగళవారం సా యంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం కు రిసింది. కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కొం కల్ గ్రామానికి చెందిన రామప్ప (65) మా రెమ్మదేవి ఉత్సవాల సందర్భంగా మురహరిదొడ్డి గ్రామంలోని కుంబరి జిందప్ప ఇంటికి వచ్చాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి బయట చెట్టు కింద రామప్పతోపాటు అఖిల, మమ త కూర్చున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్ణాటకలోని రిమ్స్ దవాఖానకు తరలించగా.. రామప్ప చికిత్స పొందుతూ బుధవారం ఉ దయం మృతి చెందాడు. అఖిల ఆరోగ్య పరిస్థితి కూ డా విషమంగా ఉన్నది.