పెద్దమందడి, సెప్టెంబర్ 7: అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బలిజపల్లి, జంగమయ్యపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలని పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 3,225 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు 3వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ప్రజల కోరిక మేరకు సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం రూ.3లక్షలు ఆర్థికసాయం చేయడం జరుగుతుందన్నారు.
ఈ పథకంలో అర్హులైన ప్రతిఒకరికీ విడుతలవారీగా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం లేదన్నారు. బలిజపల్లిలో 30, జంగమయ్యపల్లిలో 30 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం జంగమయ్యపల్లిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు, బలిజపల్లి సర్పంచ్ జయంతి, జంగమయ్యపల్లి సర్పంచ్ సతీశ్, నాయకులు తదితరులు ఉన్నారు.
వనపర్తి, సెప్టెంబర్ 7: ఉన్నంతలో కాస్తంత జాగా ఉంటేచాలు ఆ జాగాలో సొంతిల్లు కట్టుకోవాలన్నదే ప్రతి ఒక్కరి జీవిత కల అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బండారునగర్లో నిర్వహించిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎవరు ఎన్ని చెప్పినా.. ఎన్ని చేసినా చివరికి ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తి అంతిమశక్తిగా ఉంటుందన్నారు. జర్నలిస్టు జీవితం ఉన్నతమైనదని.. అందరికీ ఆదర్శంగా పనితీరు ఉండాలని, ప్రముఖ రాజకీయ నేతలు బాల్థాకరే, ఎల్క అద్వానీ జర్నలిస్టులేనని మంత్రి గుర్తు చేశారు. జర్నలిస్టులు రాసిన వార్తలతో ప్రభుత్వాలే కూలిపోయాయని,
మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజల థృక్పథం మారిపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటును ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్ మినహా మీడియా అంతా వ్యతిరేకించిన్నా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేకపోయాయన్నారు. జిల్లాకేంద్రంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంటి స్థలాల పత్రాలను అందజేస్తామన్నారు. ఇంటి స్థలం ఒక్కటేకాదు వాటితోపాటు జర్నలిస్టులకు భవిష్యత్లో గృహలక్ష్మి పథకం కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. నా పరిధిలో పరిష్కారమయ్యే జర్నలిస్టుల సమస్యలు అన్ని పరిష్కరిస్తానని, దానికి మించిన సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. ప్రజల కోసమే పని చేయడం నావిధి అని తెలిపారు. 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్న్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, జర్నలిస్టులు సైతం హాజరుకావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర చాలా గొప్పదని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు ఎనలేనివని మంత్రి భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వెల్డింగ్, ఇంజినీరింగ్, మోటర్ వైండింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బ్రహ్మయ్యచారి సమక్షంలో 105మంది, ఖిల్లా ఘణపురం మండల కేంద్రానికి చెందిన వాల్మీకి సంఘం అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో 30మంది వనపర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో వేర్వురుగా చేరారు. ముందుగా వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిథి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేశ్, జర్నలిస్టులు మధుగౌడ్, శ్రీధర్రావు, రవీందర్రెడ్డి, పొలిశెట్టి బాలకృష్ణ, రమేశ్, కొండన్నయాదవ్ తదితలు పాల్గొన్నారు.