మహబూబ్నగర్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వృద్ధుడి ఆత్మహత్య కలకలం రేపింది. వేధింపులు తాళలేక వృద్ధుడు గురువారం ఉదయం 6 గంటలకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో చోటు చేసుకున్నది. స్థాని కుల కథనం మేరకు వివరాలు.. కొండారెడ్డిపల్లికి చెంది న ఎనుముల గురువారెడ్డి (74)భార్య పదేండ్ల కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఇతడి పెద్ద కొడుకు సుధీశ్రెడ్డి హైదరాబాద్లో, చిన్న కొడుకు సురేశ్రెడ్డి అమెరికాలో నివసిస్తున్నారు. సీఎం రేవంత్కు గురువారెడ్డి పాలోళ్లు.. అయితే అదే గ్రామానికి చెందిన పార్వతమ్మకు డబ్బు అవసరం ఉండగా.. భూమిని కుదవపెట్టి డబ్బు ఇప్పించాలని గురువారెడ్డిని కోరింది.
అతడు కల్వకుర్తికి చెందిన మత్రునాయక్, పాండుగౌడ్ను సంప్రదించాడు. భూమి వారి పేర చేస్తే డబ్బులిస్తామని చెప్పడంతో పార్వతమ్మకు చెందిన రెండెకరాల భూమి వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేసి రూ.2 లక్షలు అందజేశారు. కాగా పార్వతమ్మకు తెలియకుండా గురువారెడ్డి సదరు వ్యక్తుల నుం చి రూ.8 లక్షలు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత పార్వతమ్మ డబ్బు సమకూరడంతో పొలాన్ని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని సదరు వ్యక్తులను కోరింది. నీ అప్పే రూ.10 లక్షలు ఉందని చెప్పడంతో అవాక్కైంది.
ఈ విషయమై గురువారెడ్డిని నిలదీయగా.. తాను డబ్బు తెచ్చుకున్నట్లు.. డబ్బు సమకూర్చి నీ భూమికి వచ్చేలా చూస్తానన్నాడు. తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడంతో పార్వతమ్మ ఒత్తిడి తేగా అరెకరం భూమిని తీసుకొ ని పార్వతమ్మకు భూమిని ఇవ్వాలని వారిని కోరాడు. అయితే ఈ పొలం ఫీల్డ్(మోఖా)లో లేకపోవడంతో వారు మొత్తం డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బుధవారం సాయంత్రం కొందరు గురువారెడ్డిని వంగూరు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఎస్సై లేకపోవడంతో మరుసటి రోజు రావాలని సూచించారు. దీంతో గురువారెడ్డిని గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో పెట్టి తాళం వేశారు.
ఈ అవమానాన్ని తట్టుకోలేక గురువారం తెల్లవారుజామున ఉరేసుకొని చనిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి అతడి వద్ద ఉన్న సూసైడ్ నోట్ సేకకరించారు. మత్రునాయక్, పాండుగౌడ్ మానసిక క్షోభకు గురిచేశారని, వారి వేధింపుల వల్లనే తాను చనిపోతున్నానని గురువారెడ్డి సూసై డ్ లెటర్లో పేర్కొన్నాడని ఎస్సై మహేందర్ చెప్పారు. ఈ నోట్ బహిర్గతం చేయకపోవడంతో పలువురు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. పా ర్వతమ్మ సీఎం రేవంత్రెడ్డికి వరుసకు అత్తవుతుంది. కాగా ఈ ఘటన గురించి గ్రామంలో ఎవరికి అడిగినా పూర్తి వివరాలు తెలియవని.. పెద్దోళ్లతో గొడవ మనకెందుకులే అని చెబుతున్నారు. ఆయన్ను పోలీస్స్టేషన్కు ఎవరు తీసుకెళ్లారు.. గుడిలో ఎవరు బంధించారు.. అనే విషయాన్ని ఎవరూ చెప్పలేకపోతున్నారు.