గద్వాల/ మహబూబ్నగర్/వడ్డేపల్లి, ఆగస్టు 6: మరుగున పడిన మగ్గాలకు తెలంగాణ సర్కార్ జీవం పోస్తున్నది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకుగానూ నూతన పథకాలను తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రతి సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు చేనేత వస్ర్తాలను ధరించి వారికి తోడ్పాటును అందించాలని ఇప్పటికే మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం విదితమే. బతుకమ్మ పండగకు చేనేత వస్ర్తాలను తయారు చేయించి వారికి చేతినిండ పనిని తెలంగాణ ప్రభుత్వం కల్పించి చేయూతనిచ్చింది. దీనికితోడు నేతన్నకు బీమా పేరుతో బాధిత కుంబాలకు భరోసా కల్పిస్తున్నది.
బీమా షురూ..
అంతర్జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా నేతన్న బీమా పథకాన్ని ప్రభుత్వం ఆదివారం నుంచి ప్రారంభించనున్నది. దీంతో చేనేత కార్మికులు ఎలాంటి ప్రమాదాల బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. 18 -59 సంవత్సరాల వయస్సున్న వారికి బీమా పథకానికి అర్హులుగా నిర్ణయించింది.
నేతన్నకు చేయూత..
చేనేత కార్మికులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటూ వస్తున్నది. నేతన్నకు చేయూత అనే పథకం ద్వారా జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 263 మంది కార్మికులు వారి సంపాదనలో 8శాతం వారికి ఓపెన్ చేసిన ఖాతాలో జమ చేశారు. వీరికి ప్రభుత్వం తరుఫున 16 శాతం డబ్బులు జమ చేస్తారు. చేనేత మిత్ర ద్వారా 37 మగ్గాలకు 40శాతం రాయితీతో ప్రభుత్వం ఇప్పటికే వారికి అండగా ఉండేందుకుగాను రూ. 9లక్షల 9వేల 319లను జమ చేసింది. పావలా వడ్డీకి లక్ష్మీవెంకటేశ్వర చేనేత సొసైటీ, దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి గ్రామం వారికి రూ.24లక్షల 20వేల 223 ఇచ్చారు.
రాష్ట్రస్థాయి పురస్కారం
ప్రతి ఏడాది చేనేత కార్మికుల్లో ఉత్సాహం నింపేందుకు కార్మికుల నుంచి వారి ప్రావీణ్యం ఆధారంగా సర్కార్ దరఖాస్తులను స్వీకరించి అర్హులై ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందజేస్తున్నది. ఇందుల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఆచార్య కొండా లక్ష్మణ్బాపూజీ అవార్డులకు యం.బాలనాగయ్య అమిస్తాపూర్, మల్లయ్య బస్వయ్యపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి శాంతినగర్కు చెందిన సూర్యనాగమ్మ, గద్వాలలోని రాఘవేంద్రకాలనీకి చెందిన జయశంకర్ ఉన్నారు. వీరికి ఒక్కరికీ రూ.25వేలను ఆదివారం హైదరాబాద్లోని జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా అందజేయనున్నారు.
గత ప్రభుత్వాలు
నేను నేసిన చీరతో నాకు రాష్ట్రస్థాయి పురస్కారం రావడం సంతోషంగా ఉంది. ప్రత్యేకమైనా డిజైన్తో చీర నేశాను. 900గ్రాముల బరువు ఉంది. దీన్ని నేయడానికి 15 రోజుల సమయం పట్టింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం అంటేనే చాలా గర్వంగా ఉంది. ఇది చేనేత కార్మికులకు దక్కిన గౌవరంగా భావిస్తున్నా. 20ఏండ్లకు పైగా ఇదే వృత్తిలో ఉన్నా. గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు.
– జయశంకర్, చేనేత కార్మికుడు,గద్వాల
30ఏండ్లుగా వేరేపని తెల్వదు
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చేనేత వృత్తినే చేస్తున్నాను. 30 ఏండ్లుగా వేరే పని తెలియదు. నేసిన చీరలకు కూలీ తీసుకొని బతుకుతున్నాం. నాకు భర్త ఆంజనేయులు తప్పా పిల్లలు లేరు. ఇల్లు లేదు. పొలం లేదు. పేదరికంలో బతుకుతున్నాం. ప్రభుత్వం నన్ను గుర్తించినందుకు చాలా సంతోషం.
– సూర్యనాగమ్మ , చేనేత కార్మికురాలు, శాంతినగర్