అచ్చంపేట/అచ్చంపేట టౌన్, జనవరి 27 : ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు, అధికారులు కుమ్మకై ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతులను నిలువు దోపిడీ చేస్తూ వ్యాపారస్తులు మార్కెట్కు తెచ్చిన వేరుశనగ పంట నాణ్యతను గుర్తించకుండా తక్కువ ధరలు నిర్ణయించడంపై కోపోద్రిక్తులయ్యారు. సోమవారం అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, అమ్రాబాద్ ఇతర మండలాల నుంచి రైతులు అచ్చంపేట మార్కెట్కు వేరుశనగ పంటను తీసుకొచ్చారు. మూడు రోజుల కిందట వేరుశనగ క్వింటాకు మద్దతు ధర రూ.7వేల పైచిలుకు ఉండగా, ఒక్కసారిగా సోమవారం రూ.4వేల వరకు తగ్గించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కా ర్యాలయాన్ని ముట్టడించారు. మార్కెట్ చైర్పర్సన్ అంతటి రజిత భర్త అంతటి మల్లేశ్ రైతులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా దాడి చేశారు. చొక్కా పట్టి లాగడంతో చినిగిపోయింది. భయాందోళనకు గురై కార్యాలయంలోకి పరుగెత్తగా వెంబడించారు. సెక్రటరీ నర్సింహులుపై సైతం దాడి చేశారు. ఆగ్రహంతో రైతులు కార్యాలయంలోకి వెళ్లి కుర్చీలు, ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. చేతికందిన వాటినన్నింటినీ పగులగొట్టారు.
ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి నుంచి రైతులు పెద్ద సంఖ్యలో అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అచ్చంపేట ఎస్సై రమేశ్ రైతులతో మాట్లాడి అక్కడి నుంచి మార్కెట్కి తీసుకెళ్లి వ్యాపారస్తులతో మాట్లాడి చర్చలు జరుపుతామని సముదాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి చమటోడ్చి పండించిన పంట ను అమ్ముదామని మార్కెట్కు తీసుకొస్తే నాణ్యతను పరిశీలించకుండా ఇష్టమొచ్చిన రేటును నిర్ణయిస్తూ తూకాళ్లో మోసాలు చేస్తూ అడుగడుగునా అన్యా యం చేస్తున్నారని మండిపడ్డారు.
ఒకే రైతుకు చెంది న పంటను రెండు కుప్పలను విక్రయానికి తీసుకురాగా, వేర్వేరు ధరలు నిర్ణయించడంపై రైతు ఎస్సై ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే పంటకు రెండు ధరలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. మార్కెట్లో జరుగుతున్న మోసాలను అరికట్టి న్యాయం జరిగే వరకు కొనుగోలు నిలిపి వేయాలని రైతులు డిమాం డ్ చేశారు. ఒక్కసారిగా రైతులు కార్యాలయంపై దూసుకురాగా, కార్యాలయంలో ఉన్న సిబ్బంది భయంతో బయటికి పరుగులు పెట్టారు. పోలీసులు రైతులను అదుపుచేసినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం, అధికారులు దిగివచ్చి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
కల్వకుర్తి రూరల్, జనవరి 27 : ఆరుగాలం శ్రమించి పండించిన పల్లీ పంటకు మద్దతు ధర కల్పించాలని కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో వేరుశనగ రైతులు సోమవారం ధర్నా చేపట్టారు. సోమవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి రైతులు పల్లీలను తీసుకురాగా, వ్యాపారులు సరైన ధరను టెండర్ చేయకపోవడంతో హైదరాబాద్ చౌరస్తాకు చేరుకొని ధర్నాకు దిగారు. ఇతర మార్కెట్ యార్డుల్లో పల్లీకి మద్దతు ధర దాదాపుగా 7,500 వరకు ఉండగా, కల్వకుర్తిలో మాత్రం రూ.5వేలు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించారు.
మా ర్కెట్ యార్డులోని వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు మాత్రమే రైతుల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ సరైన మద్దతు ధరను ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారులో రైతులను రాజుగా నిలబెట్టారన్నారు. వ్యాపారులు కావాలనే పల్లీకి ధరను తగ్గించారని ఆరోపించారు.
మద్దతు ధర అందించాలని, లేదంటే రీటెండరింగ్ చేయించాలని కోరారు. విషయం తెలసుకున్న వెల్దండ సీఐ, కల్వకుర్తి పోలీసులు వ్యవసాయ మార్కెట్ పాలక మండలి సభ్యులు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అదేసమయంలో మార్కెట్ యార్డుకు చేరుకున్న రాష్ట్ర వ్యవసాయ కమిటీ సభ్యుడు కేవీఎన్ రెడ్డి రైతులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, రైతులు సీఎం డౌన్డౌన్.. వద్దురా కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏఎంసీ సభ్యులు వ్యాపారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా మద్దతు ధరను అందించేలా చూడాలన్నారు.